ఆఫ్‌ స్పిన్నర్‌ గౌతమ్‌ జాక్‌పాట్‌

28 Jan, 2018 10:36 IST|Sakshi
స్పిన్నర్‌ గౌతమ్‌(ఫైల్‌ఫొటో)

బెంగళూరు : ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)-11 సీజన్‌లో భాగంగా రెండో రోజు వేలంలో కూడా ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తొలి రోజు వేలంలో పలువురు అనామక క్రికెటర్లు భారీ ధరకు అమ్ముడుపోగా, రెండో రోజు వేలంలో సైతం అదే పరంపర కొనసాగుతోంది. ఆదివారం బెంగళూరు వేదికగా జరుగుతున్న ఐపీఎల్‌ వేలంలో కర్ణాటక ఆఫ్‌ స్పిన్నర్‌ గౌతమ్‌ జాక్‌పాట్‌ కొట్టాడు. గౌతమ్‌ను రూ. 6.2 కోట్లు భారీ ధర పెట్టి  రాజస్థాన్‌ రాయల్స్‌ సొంతం చేసుకుంది. గౌతమ్‌ కనీస ధర రూ. 20 లక్షలు కాగా, అతని కోసం పలు ఫ్రాంచైజీలు పోటీ పడ్డాయి. చివరకు రాజస్థాన్‌ రాయల్స్‌ గౌతమ్‌ను అత్యధిక మొత్తానికి కొనుగోలు చేసింది. గతంలో  ముంబై ఇండియన్స్‌కు గౌతమ్‌ ప్రాతినిథ్య వహించిన  సంగతి తెలిసిందే.

ఇదిలా ఉంచితే, రెండో రోజు వేలంలో వెస్టిండీస్‌ ఓపెనింగ్‌ బ్యాట్స్‌మన్‌ ఇవెన్‌ లూయిస్‌ రూ. 3.8 కోట్లకు అమ్ముడుపోయాడు. అతన్ని ముంబై ఇండియన్స్‌ దక్కించుకుంది. మరొకవైపు స్సిన్నర్‌ రాహుల్‌ చాహర్‌ రూ. 1.9 కోట్లకు ముంబై ఇండియన్స్‌ సొంతం చేసుకోగా,  షహబాజ్‌ నదీమ్‌ను రూ. 3.2 కోట్లు పెట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ కొనుగోలు చేసింది. మరొక స్సిన్నర్‌ మురుగన్‌ అశ్విన్‌కు రూ. 2.2 కోట్లు చెల్లించి ఆర్సీబీ దక్కించుకుంది.


 

మరిన్ని వార్తలు