టైటిల్‌ పోరుకు కర్ణాటక

25 Feb, 2018 01:55 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీలో కర్ణాటక జట్టు ఫైనల్లోకి దూసు కెళ్లింది. శనివారం జరిగిన తొలి సెమీఫైనల్లో కర్ణాటక తొమ్మిది వికెట్ల తేడాతో మహారాష్ట్రను ఓడించింది. మొదట మహారాష్ట్ర 44.3 ఓవర్లలో 160 పరుగులకే ఆలౌటైంది. కర్ణాటక బౌలర్లలో కృష్ణప్ప గౌతమ్‌ 3, ప్రసిద్‌ కృష్ణ 2 వికెట్లు తీశారు. తర్వాత సునాయాస లక్ష్యాన్ని కర్ణాటక కేవలం 30.3 ఓవర్లలో వికెట్‌ కోల్పోయి 164 పరుగులు చేసి గెలిచింది. మయాంక్‌ అగర్వాల్‌ (81; 8 ఫోర్లు, 1 సిక్స్‌) మళ్లీ చెలరేగాడు.

కెప్టెన్‌ కరుణ్‌ నాయర్‌ (70; 10 ఫోర్లు)తో తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించాడు. ఈ టోర్నీ లో అత్యధిక (633) పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌ గా మయాంక్‌ రికార్డులకెక్కాడు. నేడు ఆంధ్ర, సౌరాష్ట్రల మధ్య జరిగే రెండో సెమీస్‌ విజేతతో మంగళవారం ఫైనల్లో కర్ణాటక ఆడుతుంది. 

మరిన్ని వార్తలు