కార్తీక్‌కు మూడో స్థానం 

15 Apr, 2019 04:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకాక్‌ చెస్‌ క్లబ్‌ ఓపెన్‌ అంతర్జాతీయ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్‌ కార్తీక్‌ వెంకటరామన్‌ మూడో స్థానాన్ని సంపాదించాడు. థాయ్‌లాండ్‌లో ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో తిరుపతికి చెందిన 20 ఏళ్ల కార్తీక్‌ ఏడు పాయింట్లు సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో కార్తీక్‌తోపాటు మరో ముగ్గురు కూడా ఏడు పాయింట్లు సాధించారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా కార్తీక్‌కు మూడో స్థానం ఖాయమైంది.

17 గ్రాండ్‌మాస్టర్లతో కలిపి మొత్తం 150 మంది పాల్గొన్న ఈ టోర్నీలో భారత్‌కే చెందిన దీప్‌సేన్‌ గుప్తా, జాన్‌ గుస్తాఫ్సన్‌ (జర్మనీ) 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. టైబ్రేక్‌ ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా గుస్తాఫ్సన్‌ చాంపియన్‌గా అవతరించాడు. దీప్‌సేన్‌ గుప్తా రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ లలిత్‌ బాబు 6.5 పాయింట్లతో తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు.    

మరిన్ని వార్తలు