అతనో వినూత్నమైన కెప్టెన్‌: నాయర్‌

3 Apr, 2018 13:49 IST|Sakshi
కరుణ్‌ నాయర్‌

సాక్షి, స్పోర్ట్స్‌ : ఈ సీజన్‌ ఐపీఎల్‌లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ జట్టుకు సారథిగా వ్యవహరించనున్న రవిచంద్రన్‌ అశ్విన్‌పై ఆ జట్టు ఆటగాడు కరుణ్‌ నాయర్‌ ప్రశంసలు కురిపించాడు. ‘అశ్విన్‌ చాలా మంచి వ్యక్తి.  వినూత్నమైన విధానాలతో జట్టును ముందుకు నడిపిస్తాడు. అతని నాయకత్వంలో ఆడటానికి ఉత్సాహంతో ఎదురు చూస్తున్నానని’  సంతోషం వ్యక్తం చేశాడు. ఐపీఎల్‌లో ఆడటం ద్వారా ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణించేందుకు దోహదపడుతుందని కరుణ్‌ నాయర్‌ అభిప్రాయపడ్డాడు. దేశవాళీ క్రికెటర్‌గా ఉన్న తనకు ఐపీఎల్‌లో ఆడటం ద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో కూడా మెరుగ్గా రాణించగలననే నమ్మకం వచ్చిందని పేర్కొన్నాడు. సెహ్వాగ్‌ తర్వాత ట్రిపుల్‌ సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డు నెలకొల్పిన ఈ  కర్ణాటక ఆటగాడు ఇప్పుడు అతనితో కలిసి ప్రయాణించబోతున్నందుకు ఆనందంగా ఉందన్నాడు.

ఐపీఎల్‌ 11వ సీజన్‌లో పంజాబ్‌ జట్టు.. కరుణ్‌ నాయర్‌తో పాటు కర్ణాటక యువ ఆటగాళ్లైన కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌లను కొనుగోలు చేయడం ద్వారా టైటిల్‌ వేటలో దూసుకుపోతుందని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, రాజస్తాన్‌ రాయల్స్‌, ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌కు ప్రాతినిథ్యం వహించిన కరుణ్‌ను ఈ సీజన్‌లోని పంజాబ్‌ జట్టు యాజమాన్యం రూ. 5.6 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది.

మరిన్ని వార్తలు