రాయి విసిరింది.. కెప్టెన్‌ అయింది.!

6 Dec, 2017 08:45 IST|Sakshi
రాయి విసిరితున్న అఫ్సాన్‌ ఆశిక్‌ ( ఫైల్‌).. రాజ్‌నాథ్‌ పక్కన ఇన్‌సెట్‌లో

న్యూఢిల్లీ: పోలీసులపైకి రాయి విసిరి వార్తల్లోకెక్కిన కశ్మీర్‌ యువతి అఫ్సాన్‌ ఆశిక్‌ గుర్తుందా..? ఆ అమ్మాయి ఇప్పుడు కశ్మీర్‌ తొలి మహిళా ఫుట్‌ బాల్‌ జట్టు కెప్టెన్‌ అయింది. మంగళవారం ఢిల్లీలో హోంమంత్రి రాజ్‌నాథ్‌తో 21మంది యువ క్రీడాకారిణుల కలిసారు. వీరిలో అఫ్సాన్‌ ఆశిక్‌ కూడా ఉన్నారు. ఇప్పుడు ఈ ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నాడు పోలీసుల మీదకు రాయి విసిరిన యువతి నేడు హోం మంత్రి పక్కన ఉందని, ఫుట్‌బాల్‌ కెప్టెన్‌ కూడా అయిందని నెటిజన్లు ఆశిక్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తోన్నారు.

రాజ్‌నాథ్‌ కలిసిన సందర్భంగా ఆశిక్‌ మాట్లాడుతూ.. ఆ రోజు జరిగిన సంఘటన నా జీవితాన్ని మార్చేసిందని, మా ఆత్మరక్షణ కోసమే అలా ప్రవర్తించాల్సి వచ్చిందన్నారు. కానీ మీడియా తానొక ఆందోళనకారిణిగా ముద్రవేసిందన్నారు. ఇక తన జీవితం పూర్తిగా మారిందని, క్రీడల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తెస్తానని ఆశిక్‌ వ్యాఖ్యానించారు.

కశ్మీర్‌ తొలి ఫుట్‌బాల్‌ జట్టును కలిసాను. వీరు కశ్మీర్‌ లోయలోని యువతి యువతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. కెరీర్‌ విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు.

రాయి ఎందుకు విసిరిందంటే..?
ఏప్రిల్‌ 24వ తేదీ. మంగళవారం మధ్యాహ్నం. 21 ఏళ్ల ఫుట్‌బాల్‌ కోచ్‌ అయిన అఫ్సాన్‌ ఆశిక్‌ తాను శిక్షణ ఇచ్చే దాదాపు 15 మంది విద్యార్థినులను తీసుకొని కోఠి బాగ్‌ నుంచి టూరిస్ట్‌ రిసెప్షన్‌ సెంటర్‌లో ఉన్న ఫుట్‌బాల్‌ మైదానానికి బయల్దేరారు. వారు రోజూ వెళ్లేది అదే దారిలోనే. ఫుట్‌బాల్‌ మైదానికి చేరుకోవడానికి దాదాపు 15 నిమిషాలు పడుతుంది. ఇంతలో ఆ వీధిలో ఓ పక్క నుంచి అల్లరి మూక రాళ్లను రువ్వడం ప్రారంభించింది. 

అక్కడ ఓ పోలీసు అధికారి ఆశిక్‌ టీమ్‌లోని అమ్మాయిలను పిలిచి అసభ్యంగా మాట్లాడారు. ఓ అమ్మాయి మీద చేయి కూడా చేసుకున్నారు. ఆశిక్‌ వెళ్లి తాము ఎవరమో, ఎక్కడికి వెళుతున్నామో నచ్చ చెప్పేందుకు ప్రయత్నించింది. ఆ పోలీసు అధికారి వినిపించుకోకుండా తక్షణం అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా బూతులు తిట్టారు. మీరు యూనిఫామ్‌లో ఉన్నారు కనుక మేము మీపై చేయిచేసుకోలేం.

కాస్త ఇటువైపు వీధిలోకి రండీ, మీ సంగతి చెబుతాం’ అని ఆసిక్‌ ఓ పోలీసు అధికారిని హెచ్చరించి తన మానాన తన టీమ్‌ను తీసుకొని ముందుకెళ్లింది. అయినప్పటికీ పోలీసు అధికారి దూషిస్తుండడంతో అనుకోకుండానే క్షణికావేశంలో ఆశిక్‌ రోడ్డుపైనున్న ఓ రాయిని అందుకొని బలంగా పోలీసులపైకి రువ్వింది. రాయి విసురుతున్న ఫొటోను రాయ్‌టర్‌ సంస్థ ప్రముఖంగా ప్రచురించడంతో అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

అప్సాన్‌ ఆశిక్‌పై బయోపిక్‌..
బయోపిక్‌ మానియా నడుస్తున్న బాలీవుడ్‌లో సినిమా స్టోరిని తలిపించేలా ఉన్న అప్సాన్‌ ఆశిక్‌ జీవితాన్ని కూడా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. బాలీవుడ్‌ నటుడు గుల్షాన్‌ గ్రోవర్‌ కుమారుడు సంజయ్‌ నిర్మాణంలో ఈ బయోపిక్‌ తెరకెక్కనుంది.

మరిన్ని వార్తలు