సెమీస్‌లో కశ్యప్

11 Apr, 2015 01:58 IST|Sakshi

గాయంతో వైదొలిగిన ప్రణయ్
సింగపూర్ ఓపెన్

 
సింగపూర్ : భారత బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నీలో తన జైత్రయాత్ర కొనసాగిస్తున్నాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో కశ్యప్ 21-6, 21-17తో బ్రైస్ లివర్‌డెజ్ (ఫ్రాన్స్)పై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు. మరో మ్యాచ్‌లో హెచ్.ఎస్. ప్రణయ్ పాదం గాయంతో ప్రత్యర్థికి వాకోవర్ ఇచ్చాడు. బ్రైస్‌తో 30 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌లో కశ్యప్ చెలరేగిపోయాడు.

తొలిగేమ్‌లో 6-1, 9-6 ఆధిక్యం సాధించిన హైదరాబాద్ కుర్రాడు తర్వాత వరుసగా 12 పాయింట్లు నెగ్గి గేమ్‌ను కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌లోనూ అదే జోరుతో 4-1 ఆధిక్యాన్ని సంపాదించాడు. కానీ బ్రైస్ పుంజుకొని ఆధిక్యాన్ని 7-9కి తగ్గించాడు. తర్వాత ఇరువురు ఒకటి, రెండు పాయింట్లతో ముందుకెళ్లినా... చివర్లో కశ్యప్ మెరుగ్గా ఆడాడు. శనివారం జరిగే సెమీస్‌లో కశ్యప్... హు యున్ (హాంకాంగ్)తో తలపడతాడు.

మరిన్ని వార్తలు