లక్కీ జాదవ్‌..

28 Jan, 2019 13:50 IST|Sakshi

ప్రసుత్తం  భారత క్రికెట్‌ జట్టులో ఆటగాళ్ల మధ్య తీవ్ర పోటీ కొనసాగుతోంది. ఇప్పటికే కొంతమంది  జట్టులో రెగ్యులర్‌ ఆటగాళ్లగా కొనసాగుతుండగా, మరికొంతమంది మాత్రం ఎప్పటికప్పుడు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూనే ఉన్నారు. అలా ఇప్పటికీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న ఆటగాళ్లలో కేదార్‌ జాదవ్‌ ఒకడు. కాగా, భారత జట్టుకు జాదవ్‌ లక్కీగా మారడం ఇక‍్కడ విశేషం. భారత్‌ తరుఫున జాదవ్‌ ఆడిన చివరి 16 వన్డేల్లోనూ భారత్‌ పరాజయం చెందకపోవడమే అందుకు కారణం.

టీమిండియా మిడిలార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్న కేదార్ జాదవ్ బ్యాట్‌తో భారీ సంఖ్యలో సెంచరీలు సాధించిందీ లేదు, అలా అని బంతితోనూ అమితంగా ఆకట్టుకున్నదీ లేదు. అయితే అతడు తుది జట్టులో ఉంటే మాత్రం జట్టు విజయాలు సాధిస్తుందనేది గణాంకాలు చెబుతున్నాయి. ప్రధానంగా దాదాపు గత 15 నెలలుగా కాలంగా జాదవ్‌ ఆడిన అన్నీ వన్డే మ్యాచ్‌ల్లోనూ భారత్‌ ఓటమి చూడలేదు.

అక్టోబరు 25, 2017 నుంచి కేదార్ జాదవ్ 16 వన్డేల్లో ఆడితే భారత్ ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ ఓడిపోలేదు. గత ఏడాది ఆసియా కప్‌లో అఫ్గానిస్తాన్‌తో జరిగిన ఒక మ్యాచ్‌ మాత్రమే టై ముగిసింది. అటు బ్యాట్‌తోనూ, ఇటు బంతితోనూ రాణిస్తూ తనకు వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటున్నాడు. ఇప‍్పటివరకూ జాదవ్‌ ఆడిన వన్డే మ్యాచ్‌ల సంఖ్య 52.  2014లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు జాదవ్‌. అతని వన్డే కెరీర్‌లో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్‌ సెంచరీలు మాత‍్రమే చేయగా, 24 వికెట్లు తీశాడు.

మరిన్ని వార్తలు