క్రికెట్‌ బోర్డులో సంచలన నిర్ణయాలు

23 Feb, 2018 11:58 IST|Sakshi

కెన్యా క్రికెట్ బోర్డులో ముసలం చెలరేగింది. వరల్డ్ క్రికెట్ లీగ్ డివిజన్ 2లో కెన్యా క్రికెట్‌ జట్టు ఘోర ప్రదర్శన కనపరిచింది. దీంతో ఓటమికి బాధ్యత వహిస్తూ కెఫ్టెన్‌ రాకెప్‌ పటేల్‌ కెఫ్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు. కాగా, అతని అడుగుజాడల్లోనే తాత్కాలిక కోచ్ థామస్ ఓడియో కూడా పదవి నుంచి తప్పుకున్నారు. అంతే కాకుండా కెన్యా క్రికెట్‌ బోర్డులోప్రెసిడెంట్ జాకీ జాన్ మహ్మద్ బాధ్యతల నుంచి వైదొలిగారు.

నమీబియాలో జరిగిన ప్రపంచకప్ లీగ్ డివిజన్-2 టోర్నమెంట్‌లో కనీసం ఒక్క మ్యాచ్‌లోనైనా కెన్యా విజయం సాధించలేకపోయింది. ఈ టోర్నీలో పాల్గొన్న ఆరు జట్లలో కెన్య చివరి స్థానంలో నిలిచింది. ఈ ఘోర పరాజయానికి నైతిక బాధ్యతగా తొలుత కెప్టెన్ రాకెప్ పటేల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఆపై కోచ్‌ థామస్‌ ఓడియో కూడా తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప‍్రకటించారు. కాగా, ప్రపంచ క్రికెట్‌లో ఒక క్రికెట్‌ బోర్డుకు తొలిసారి మహిళా అధ్యక్షురాలిగా సేవలందిస్తున్న కెన్యా బోర్డు ప్రెసిడెంట్‌ జాకీ జాన్ మహ్మద్ సైతం నైతిక బాధ్యతగా వీడ్కోలు నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటికే సరైన గుర్తింపు, ఆదరణ లేకపోవడంతో పాటు ఆర్థికంగానూ కెన్యా క్రికెట్‌ బోర్డు ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇలాంటి పరిస్థితిలో ఈ మూకుమ్మడి రాజీనామాలతో స్థానిక క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. త్వరలోనే అధ్యక్ష పదవి కోసం కెన్యా బోర్డు ఎన్నికలు నిర్వహించనుంది.
 

మరిన్ని వార్తలు