కేరళను సెమీస్‌కు చేర్చిన వినీత్

12 Dec, 2016 14:54 IST|Sakshi
కేరళను సెమీస్‌కు చేర్చిన వినీత్
కీలకమ్యాచ్‌లో నార్త్ ఈస్ట్‌పై విజయం  
 కొచ్చి: ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) ఫుట్‌బాల్ టోర్నమెంట్ లీగ్ దశ ముగిసింది. కీలక మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ యునెటైడ్ జట్టుపై కేరళ బ్లాస్టర్స్ విజయం సాధించి సెమీఫైనల్ బెర్త్‌ను దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో కేరళ బ్లాస్టర్స్ 1-0తో నార్త్ ఈస్ట్ జట్టును ఓడించింది. ఆట 66వ నిమిషంలో వినీత్ చేసిన గోల్‌తో కేరళ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న బ్లాస్టర్స్ విజయాన్ని ఖాయం చేసుకుంది. సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో నార్త్ ఈస్ట్ ఓటమిపాలై నాకౌట్ దశకు అర్హత పొందలేకపోయింది. ఈ విజయంతో కేరళ బ్లాస్టర్స్ మొత్తం 22 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకింది. ఇప్పటికే ముంబై సిటీ, ఢిల్లీ డైనమోస్, అట్లెటికో డి కోల్‌కతా సెమీస్‌కు చేరాయి. ఈనెల 10 నుంచి 14 వరకు జరిగే సెమీఫైనల్స్‌లో ఢిల్లీ డైనమోస్‌తో కేరళ బ్లాస్టర్స్; కోల్‌కతాతో ముంబై సిటీ ఎఫ్‌సీ తలపడతాయి.
 
 
మరిన్ని వార్తలు