కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం

21 Oct, 2019 02:47 IST|Sakshi

2–1తో కోల్‌కతాపై విజయం

ఐఎస్‌ఎల్‌ ఆరో సీజన్‌ షురూ

కొచ్చి: ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) ఆరో సీజన్‌లో కేరళ బ్లాస్టర్స్‌ శుభారంభం చేసింది. ఆదివారం ఇక్కడి జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో జరిగిన సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో కేరళ 2–1తో అట్లెటికో డి కోల్‌కతాపై గెలిచింది. కేరళ ఆటగాడు బార్తలోమెవ్‌ ఒగ్బెచ్‌ రెండు గోల్స్‌ సాధించగా... కోల్‌కతా తరఫున కార్ల్‌ మెక్‌హ్యూ గోల్‌ చేశాడు. ఆట 6వ నిమిషంలో కార్ల్‌ మెక్‌హ్యూ గోల్‌ చేసి కోల్‌కతాకు ఆధిక్యాన్నిచ్చాడు. అయితే 30వ నిమిషంలో లభించిన పెనాల్టీ కిక్‌ను గోల్‌గా మలిచిన ఒగ్బెచె స్కోర్‌ను సమం చేశాడు.

మొదటి అర్ధ భాగం చివరి నిమిషంలో మరో గోల్‌ చేసిన ఒగ్బెచె కేరళకు 2–1తో ఆధిక్యాన్నిచ్చాడు. చివరిదాకా కేరళ ఈ ఆధిక్యాన్ని కాపాడుకొని తమ ఖాతాలో మూడు పాయింట్లు వేసుకుంది. మ్యాచ్‌కు ముందు ప్రారంత్సవంలో బాలీవుడ్‌ స్టార్స్‌ టైగర్‌ ష్రాఫ్, దిశా పటానీల నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేడు జరిగే మ్యాచ్‌లో బెంగళూరుతో నార్త్‌ ఈస్ట్‌ యునైటెడ్‌ జట్టు ఆడుతుంది.   

>
మరిన్ని వార్తలు