మహరాజ్‌ మాయ

21 Jul, 2018 00:51 IST|Sakshi

ఎనిమిది వికెట్లు తీసిన దక్షిణాఫ్రికా స్పిన్నర్‌     శ్రీలంక 277/9

కొలంబో: ఓపెనింగ్‌ జంట తరఫున రెండేళ్ల తర్వాత శతక భాగస్వామ్యం నమోదైనా... దక్షిణాఫ్రికా ఎడంచేతి వాటం స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ (8/116) ధాటికి శ్రీలంక కుప్పకూలింది. శుక్రవారం ఇక్కడ ప్రారంభమైన రెండో టెస్టులో తొలి రోజు ఆట ముగిసే సమయానికి లంక 277/9తో నిలిచింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు ఓపెనర్లు గుణతిలక (57; 6 ఫోర్లు), కరుణరత్నే (53; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 116 పరుగులు జోడించి శుభారంభం అందించారు. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ ధనంజయ డిసిల్వా (60) కూడా అర్ధ శతకం చేయడంతో ఓ దశలో లంక 152/2తో పటిష్ఠ స్థితిలో నిలిచింది.

అయితే, ఈ ముగ్గురితో పాటు కుశాల్‌ మెండిస్‌ (21; 4 ఫోర్లు), మాథ్యూస్‌ (10)లను అవుట్‌ చేసి మహరాజ్‌ దెబ్బ తీశాడు. రోషన్‌ సిల్వా (22; 3 ఫోర్లు)ను రబడ వెనక్కుపంపాడు. ఈ ఒక్కటి మినహా మిగతా వికెట్లన్నీ కేశవ్‌కే దక్కాయి. లంక గడ్డపై ఓ విదేశీ బౌలర్‌కిదే అత్యుత్తమ ప్రదర్శన కావడం విశేషం. అతడి దెబ్బకు 111 పరుగుల తేడాతో లంక 7 వికెట్లు కోల్పోయింది. ఆటముగిసే సమయానికి అఖిల ధనంజయ (16 బ్యాటింగ్‌), హెరాత్‌ (5 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. డొనాల్డ్, క్లూసెనర్‌ తర్వాత విదేశాల్లో 8 వికెట్లు పడగొట్టిన మూడో దక్షిణాఫ్రికా బౌలర్‌గా కూడా కేశవ్‌ మహరాజ్‌ రికార్డులకెక్కాడు.  

మరిన్ని వార్తలు