పీటర్సన్‌ గుడ్‌ బై?

7 Jan, 2018 17:52 IST|Sakshi

లండన్‌:2013-14 యాషెస్‌ సిరీస్‌ సందర్బంగా వివాదాస్పద రీతిలో వ్యవహరించి ఇంగ్లండ్‌ జట్టుకు దూరమైన మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌.. త్వరలోనే అన్ని స్థాయిల క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందులో భాగంగా ఇదే తన చివరి బిగ్‌బాష్‌ లీగ్‌(బీబీఎల్‌) అంటూ పీటర్సన్‌ వెల్లడించడం అందుకు బలాన్ని చేకూరుస్తుంది. 'నా బిగ్‌బాష్‌ లీగ్‌ కెరీర్‌కు ముగింపు పలుకుతున్నా. దీనికోసం రాబోవు 10 నెలలు పాటు వేచి చూసి నిర్ణయం తీసుకోవాలను కోవడం లేదు. ఇక కొన్ని రోజుల పాటు మాత్రమే క్రికెట్‌ ఆడతా. వాటిని ఎంజాయ్‌ చేస్తూ ఆడతా. వచ్చే డిసెంబర్‌లో ఆరంభమయ్యే బీబీఎల్‌లో కనిపించను' అని పీటర్సన్‌ పేర్కొనడం మొత్తంగా క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పేందుకు తొలి అడుగుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


 ఇంగ్లండ్‌ తరపున 2004లో వన్డేల్లో, 2005లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. సుమారు 10 సంవత్సరాల పాటు ఇంగ్లండ్‌కు ఆడిన పీటర్సన్‌ 104 టెస్టులు, 136 వన్డేలు ఆడాడు. 2014లో టెస్టు, 2013లో వన్డేలకు పీటర్సన్‌ వీడ్కోలు పలికాడు. ఆపై ప్రపంచ వ్యాప్తంగా పలు లీగ్‌లో ఆడుతున్న పీటర్సన్‌.. బిగ్‌బాష్‌ లీగ్‌లో మెల్‌బోర్న్‌ రెనిగేడ్స్‌ తరపున ఆడుతున్నాడు. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రెనిగేడ్స్‌ విజయంలో పీటర్సన్‌ 40 పరుగులు సాధించి జట్టుకు విజయాన్ని అందించాడు. అయితే ఈ మ్యాచ్‌ తరువాత మీడియా సమావేశం ఏర్పాటు చేసిన పీటర్సన్‌.. వచ్చే బిగ్‌బాష్‌లో ఆడటం లేదని స్పష్టం చేశాడు. దాంతో మొత్తం క్రికెట్‌కు పీటర్సన్‌ దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు