ఆ రెండు జట్లే ఫైనల్లో తలపడేవి: పీటర్సన్‌

8 Jul, 2019 14:52 IST|Sakshi

మాంచెస్టర్‌: వరల్డ్‌కప్‌ సెమీస్‌ సమరానికి ముందు అటు క్రికెటర్లు, ఇటు విశ్లేషకుల అంచనాలు జోరందుకున్నాయి. భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు వరల్డ్‌కప్‌ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయని ఇప్పటికే దక్షిణాఫ్రకా సారథి డుప్లెసిస్‌ జోస్యం చెప్పగా, అదే అభిప్రాయాన్ని తాజాగా ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ కెవిన్‌ పీటర్సన్‌ వ్యక్తం చేశాడు. తన అంచనా ప్రకారం భారత్‌-ఇంగ్లండ్‌ జట్లే టైటిల్‌ వేటలో పోటీ పడతాయని స్పష్టం చేశాడు. తొలి సెమీ ఫైనల్లో న్యూజిలాండ్‌పై టీమిండియా గెలవడం ఖాయమని, అదే సమయంలో రెండో సెమీస్‌లో ఆసీస్‌ను ఇంగ్లండ్‌ చిత్తు చేస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.  ఆదివారం ‘హోమ్‌ ఆఫ్‌ ద క్రికెట్‌’ లార్డ్స్‌ మైదానంలో జరుగనున్న  మెగా సమరంలో భారత్‌-ఇంగ్లండ్‌ జట్లు అమీతుమీ తేల్చుకుంటాయని పేర్కొన్నాడు. మొదట్నుంచీ భారత్‌ పైనల్‌కు చేరుతుందంటూ చెబుతున్న పీటర్సన్‌..అదే అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేశాడు.

టీమిండియా 9 మ్యాచ్‌లు ఆడి 15 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. లీగ్ దశలో ఇంగ్లండ్‌పై మాత్రమే ఓడిపోయింది. న్యూజిలాండ్‌తో జరగాల్సిన లీగ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఇక న్యూజిలాండ్ ఆరంభంలో అదరగొట్టినప్పటికీ తర్వాత పాకిస్తాన్, ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌ చేతుల్లో ఓడిపోయి 11 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. కాగా, దక్షిణాఫ్రికాపై ఓడిపోయి ఆస్ట్రేలియా అగ్రస్థానం నుంచి రెండో స్థానానికి దిగజారింది.

మరిన్ని వార్తలు