ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ

7 Jul, 2019 20:18 IST|Sakshi

బర్మింగ్‌హామ్‌: వరల్డ్‌కప్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే గాయం కారణంగా షాన్‌ మార్ష్‌ టోర్నీ నుంచి వైదొలగగా, తాజాగా అదే జాబితాలో ఉస్మాన్‌ ఖవాజా కూడా చేరిపోయాడు. తొడ కండరాల నొప్పితో సతమవుతున్న ఉస్మాన్‌ ఖవాజా వరల్డ్‌కప్‌ నుంచి నిష్క్రమించినట్లు ఆసీస్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ తెలిపాడు. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వరల్డ్‌కప్‌ చివరి లీగ్‌ మ్యాచ్‌లో ఖవాజా తొడ కండరాలు పట్టేశాయి. దాంతో అతను మిగిలి ఉన్న వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని లాంగర్‌ పేర్కొన్నాడు. ‘ ఖవాజాకు మూడు నుంచి నాలుగు వారాల విశ్రాంతి అవసరం. దాంతో ఖవాజా వరల్డ్‌కప్‌ నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఇంగ్లండ్‌తో కీలక సెమీ ఫైనల్‌కు ముందు ఇలా జరగడం బాధాకరం. మా జట్టులో అతను ప్రధాన ఆటగాడు. యాషెస్‌ సిరీస్‌ నాటికి ఖవాజా అందుబాటులోకి వస్తాడు’ అని లాంగర్‌ తెలిపాడు.

దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఖవాజా ఐదు బంతులు ఆడిన తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా పెవిలియన్‌ చేరాడు. కాగా, ఆసీస్‌ ఏడు వికెట్లు కోల్పోయిన తరుణంలో ఖవాజా బ్యాటింగ్‌కు వచ్చాడు. ఈ మ్యాచ్‌లో ఖవాజా 14 బంతులు ఆడి 18 పరుగులు చేశాడు. గాయపడ్డ ఖవాజా స్థానంలో మాథ్యూ వేడ్‌కు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) టెక్నికల్‌ కమిటీ నుంచి ఆమోదం లభించాల్సి ఉంది.

మరిన్ని వార్తలు