రెండో రౌండ్‌లోనే ఇంటిముఖం..

21 Nov, 2019 14:41 IST|Sakshi

గ్వాంగ్‌జు(కొరియా): భారత షట్లర్‌ కిడాంబి శ్రీకాంత్‌ కొరియా మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 టోర్నమెంట్‌లో ఇంటిముఖం పట్టాడు. పురుషుల సింగిల్స్‌లో భాగంగా గురువారం జరిగిన రెండో రౌండ్‌ పోరులో శ్రీకాంత్‌ 14-21, 19-21 తేడాతో కంటా సునేయామా(జపాన్‌)చేతిలో పరాజయం చవిచూశాడు. సునేయామాతో తొలిసారి తలపడిన శ్రీకాంత్‌ ఎటువంటి వరుస రెండు గేమ్‌లు సమర్పించుకుని ఓటమి పాలయ్యాడు. కేవలం 37 నిమిషాలు పాటు జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్‌ ఎటువంటి ప్రభావం చూపలేకపోయాడు.

తొలి గేమ్‌ను దారుణగా కోల్పోయిన శ్రీకాంత్‌.. రెండో గేమ్‌ చివర్లో కాస్త ప్రతిఘటించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన ఇండియన్‌ ఓపెన్‌లో ఫైనల్‌కు చేరిన శ్రీకాంత్‌.. అప్పట్నుంచీ తిరిగి గాడిలో పడటానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు మాత్రం నమోదు చేయడం లేదు. ఇక భారత షట్లర్‌ సమీర్‌ వర్మ కథ కూడా ప్రిక్వార్టర్స్‌లోనే ముగిసింది. దక్షిణకొరియాకు చెందిన కిమ్‌ డాంగన్‌ చేతిలో సమీర్‌ పరాజయం చెందాడు. డాంగన్‌ 21-19, 21-12 తేడాతో సమీర్‌ను బోల్తా కొట్టించాడు.

మరిన్ని వార్తలు