రియో డి జనీరో: రియో ఒలింపిక్స్లో ఆటగాళ్లు పతకం తెస్తారని భారత్ ఆశిస్తున్న గేమ్ బ్యాడ్మింటన్. అందుకు తగ్గట్టుగానే ఇండియన్ ప్లేయర్స్ రాణిస్తున్నారు. గురువారం జరిగిన మ్యాచ్ లలో పీవీ సింధు, సైనా నెహ్వాల్ ముందంజ వేయగా అదేబాటలో కిదాంబి శ్రీకాంత్ నడిచాడు. బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ శుభారంభం చేశాడు. గ్రూప్-హెచ్ లో భాగంగా శుక్రవారం జరిగిన తన తొలి మ్యాచ్ లో మెక్సికో ఆటగాడు లినో మునోజ్ పై శ్రీకాంత్ 21-11, 21-17 తేడాతో నెగ్గాడు.
తొలి సెట్ లో ప్రత్యర్థిని ముప్పుతిప్పలు పెట్టిన శ్రీకాంత్, రెండో సెట్లో కాస్త వెనుకంజ వేశాడు. అయితే వెంటనే తేరుకుని వరుస పాయింట్లతో చెలరేగి ప్రత్యర్థి మునోజ్ కు అవకాశం ఇవ్వకుండా రెండో సెట్ కైవసం చేసుకోవడంతో విజయాన్ని సాధించాడు.