కింగ్స్ పంజాబ్ అదుర్స్..

1 May, 2017 07:56 IST|Sakshi
కింగ్స్ పంజాబ్ అదుర్స్..

మొహాలి: గత మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో పోరాడి ఓడిన కింగ్స్ పంజాబ్.. తాజాగా ఢిల్లీ డేర్ డెవిల్స్ తో జరిగిన మ్యాచ్ లో అదుర్స్ అనిపించింది. తొలుత బౌలింగ్ లో ఇరగదీసిన కింగ్స్..ఆపై బ్యాటింగ్ లో కూడా రాణించి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ విసిరిన 68 పరుగుల లక్ష్యాన్ని కింగ్స్ పంజాబ్ 7.5 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా ఛేదించింది. కింగ్స్ ఓపెనర్లు మార్టిన్ గప్టిల్(50 నాటౌట్; 27 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లు), హషీమ్ ఆమ్లా(16 నాటౌట్;20 బంతుల్లో 1 ఫోర్)లు లక్ష్యాన్ని తొందరగా ముగించి మిగతా ఆటగాళ్లకు పని తగ్గించారు. ఇది కింగ్స్ పంజాబ్ కు నాల్గో విజయం కాగా, ఢిల్లీకి ఆరో ఓటమి.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఢిల్లీ డేర్ డెవిల్స్ 17.1 ఓవర్లలో 67 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఐపీఎల్ చరిత్రలో మూడో అత్యల్ప స్కోరు నమోదైంది.   ఈ రోజు మ్యాచ్ లో క్రీజ్లోకి వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లే పెవిలియన్ చేరడంతో ఢిల్లీ స్వల్పలక్ష్యాన్ని మాత్రమే నిర్దేశింది.  సంజూ శాంసన్(5), శ్యామ్ బిల్లింగ్స్(0), కరుణ్ నాయర్(11),అయ్యర్(6), రిషబ్ పంత్(3), క్రిస్ మోరిస్(2), రబడా(11), మొహ్మద్ షమీ(2), నదీమ్(0)లు తీవ్రంగా నిరాశపరచగా,  కోరీ అండర్సన్(18) టాప్ స్కోరర్ గా నిలిచాడు. కింగ్స్ పంజాబ్ బౌలర్ సందీప్ శర్మ నాలుగు వికెట్లతో ఢిల్లీ పతనాన్ని శాసించగా, వరుణ్ అరోన్, అక్షర్ పటేల్లు తలో రెండు వికెట్లతో సత్తా చాటారు. మ్యాక్స్ వెల్, మోహిత్ శర్మలకు చెరో వికెట్ దక్కింది.
 

ఢిల్లీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ ఆఖరి బంతికి శ్యామ్ బిల్లింగ్స్ డకౌట్ గా అవుటై నిరాశపరిచాడు.ఆ పై సంజూ శాంసన్ కూడా నిష్క్రమించడంతో ఢిల్లీ ఏడు పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.ఆ తరుణంలో కరుణ్ నాయర్-అయ్యర్లు కాసేపు ప్రతిఘటించే యత్నం చేసినప్పటికీ స్వల్ప వ్యవధిలో వీరిద్దరూ పెవిలియన్ చేరారు. దాంతో 25 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఢిల్లీ ఇక తేరుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ కింగ్స్ కు దాసోహమైంది.

మరిన్ని వార్తలు