లాడర్హిల్ (అమెరికా): భారత క్రికెటర్ కేఎల్ రాహుల్ ముంగిట అరుదైన రికార్డు నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించే అవకాశం ఇప్పుడు రాహుల్ ముందుంది. తన అంతర్జాతీయ టీ20 కెరీర్లో రాహుల్ ఇప్పటివరకూ చేసిన పరుగులు 879. మరో 121 పరుగులు సాధిస్తే వెయ్యి పరుగులు సాధించిన ఏడో భారత ఆటగాడిగా రాహుల్ నిలుస్తాడు. అదే సమయంలో విండీస్తో తొలి టీ20లో రాహుల్ వెయ్యి పరుగుల మార్కును చేరితే ఫాస్టెస్ట్ రికార్డు అతని సొంతమవుతుంది. తన 25వ టీ20 ఇన్నింగ్స్లోనే వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రాహుల్ ఘనత సాధిస్తాడు.
అదే సమయంలో ఇప్పటివరకూ పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ అజమ్ పేరిట ఉన్న రికార్డు కూడా బద్ధలవుతుంది. బాబర్ అజమ్ 26 ఇన్నింగ్స్ల్లో వెయ్యి పరుగులు అంతర్జాతీయ పరుగులు సాధించి ఆ ఫీట్ను వేగవంతంగా సాధించిన ఆటగాడిగా ఉన్నాడు. ఇక్కడ కోహ్లి(27 ఇన్నింగ్స్లు) రెండో స్థానంలో ఉండగా, అరోన్ ఫించ్(29 ఇన్నింగ్స్లు) మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఒకవేళ రాహుల్ గనుక 121 పరుగుల్ని విండీస్తో తొలి టీ20లో సాధిస్తే ఫాస్టెస్ట్ రికార్డును లిఖిస్తాడు.