కోహ్లిని ఊరిస్తున్న కెప్టెన్సీ రికార్డులు

28 Jan, 2020 13:55 IST|Sakshi

హామిల్టన్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లిని పలు రికార్డులు ఊరిస్తున్నాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో 45 పరుగులు చేసిన కోహ్లి.. రెండో టీ20లో 11 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే కివీస్‌తో మూడో టీ20లో కోహ్లి 25 పరుగులు చేస్తే ఎంఎస్‌ ధోని రికార్డును బ్రేక్‌ చేస్తాడు. అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా ధోని చేసిన పరుగులు 1,112.  ఇప్పుడు ఈ రికార్డును బ్రేక్‌ చేయడానికి కోహ్లికి 25 పరుగులు అవసరం.  భారత్‌ తరఫున కెప్టెన్‌గా అత్యధిక టీ20 పరుగులు చేసిన రికార్డు ఇప్పటివరకూ ధోని పేరిట ఉంది. ఇది రేపటి మ్యాచ్‌లో బద్ధలయ్యే అవకాశం ఉంది.  ఓవరాల్‌ లిస్టులో డుప్లెసిస్‌(1,273), కేన్‌ విలియమ్సన్‌(1,148)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.

ఇక అంతర్జాతీయ టీ20ల్లో యాభైకి పైగా పరుగుల్ని అత్యధిక సార్లు సాధించిన కెప్టెన్ల జాబితాలో డుప్లెసిస్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్న కోహ్లి.. మరో హాఫ్‌ సెంచరీ సాధిస్తే కివీస్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ సరసన చేరతాడు. కేన్‌ విలియమ్సన్‌ కెప్టెన్‌గా ఎనిమిదిసార్లు యాభైకి పైగా పరుగులు సాధించాడు. మరొకవైపు అంతర్జాతీయ టీ20ల్లో 50 సిక్సర్లు కొట్టిన కెప్టెన్ల జాబితాలో చేరడానికి కోహ్లికి ఏడు సిక్సర్లు అవసరం. ఈ ఫీట్‌ను కేవలం ఇంగ్లండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ మాత్రమే సాధించాడు. కోహ్లి మరో ఏడు సిక్సర్లు సాధిస్తే కెప్టెన్‌గా 50 సిక్సర్లు కొట్టిన రెండో క్రికెటర్‌గా నిలుస్తాడు. (ఇక్కడ చదవండి: ‘ధోని సీటును అలానే ఉంచాం’)

మరిన్ని వార్తలు