మౌంట్ మాంగనీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఘనతను సాధించాడు. భారత్-న్యూజిలాండ్ల మధ్య జరిగిన వన్డేల పరంగా చూస్తే అత్యధిక పరుగులు సాధించిన రెండో క్రికెటర్గా కోహ్లి నిలిచాడు. శనివారం న్యూజిలాండ్తో జరుగుతున్న రెండో వన్డేలో కోహ్లీ ఈ ఫీట్ను సాధించాడు. ఈ మ్యాచ్లో కోహ్లి(43; 45 బంతుల్లో 5 ఫోర్లు) స్కోరును పెంచే క్రమంలో భారీ షాట్కు యత్నించి ఔటయ్యాడు. కాగా, ఇరు జట్ల మధ్య జరిగిన ఓవరాల్ వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన జాబితాలో రెండో స్థానాన్ని ఆక్రమించాడు. న్యూజిలాండ్పై వన్డేల్లో కోహ్లి సాధించిన పరుగులు 1242. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ మాజీ ఆటగాడు నాధన్ ఆస్టల్(1207) రికార్డును కోహ్లి సవరించాడు. కాగా, ఇక్కడ సచిన్ టెండూల్కర్(1750) తొలి స్థానంలో ఉండగా, వీరేంద్ర సెహ్వాగ్(1157) నాల్గో స్థానంలో కొనసాగుతున్నాడు.
తాజా మ్యాచ్లో భారత్కు శుభారంభం లభించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ల జోడి 154 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారత్ను పటిష్ట స్థితికి చేర్చారు. తొలుత రోహిత్ శర్మ 62 బంతుల్లో అర్థసెంచరీ సాధించగా.. శిఖర్ ధావన్ 53 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ధావన్(66; 67 బంతుల్లో 9 ఫోర్లు).. వికెట్ కీపర్ లాథమ్కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.ఆపై కొద్దిసేపటికి రోహిత్(87; 96 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫెర్గీసన్ బౌలింగ్లో క్యాచ్ ఔట్గా వెనుదిరిగాడు. దాంతో 172 పరుగుల వద్ద భారత్ రెండో్ వికెట్ను కోల్పోయింది. ఆ తర్వాత కోహ్లి-అంబటి రాయుడు ద్వయం స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. రాయుడుతో కలిసి 64 పరుగులు జత చేసిన తర్వాత కోహ్లి మూడో వికెట్గా పెవిలియన్ చేరాడు.