ఇక కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌: కోహ్లి

20 Jan, 2020 11:24 IST|Sakshi

బెంగళూరు: ఇప్పటివరకూ వరుసగా భారత క్రికెట్‌ జట్టులో చోటు దక్కించుకుంటూ వచ్చిన యువ వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ పరిస్థితి ఇప్పుడు డైలమాలో పడింది. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ సక్సెస్‌ కావడంతో రిషభ్‌కు ఉద్వాసన తప్పదనే సంకేతాలను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇచ్చేశాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో కూడా కీపర్‌గా కేఎల్‌ రాహులే కొనసాగుతాడని కోహ్లి స్పష్టం చేశాడు. దాంతో రిషభ్‌ మరికొంత కాలం నిరీక్షించాల్సిందేనని విషయాన్ని చెప్పకనే చెప్పేశాడు.  ఆసీస్‌తో మూడో వన్డే నాటికి గాయం నుంచి రిషభ్‌ తేరుకున్నప్పటికీ అతన్ని తుది జట్టులో వేసుకోలేదు. ‘న్యూజిలాండ్‌ పర్యటనలో రాహుల్‌ను ఎందుకు కీపర్‌గా కొనసాగించకూడదు. ఆసీస్‌ సిరీస్‌లో రాహుల్‌ తనకిచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. అటు బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పుతో పాటు కీపర్‌గా కూడా తన పాత్ర సమర్ధవంతంగా నిర్వర్తించాడు. రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలతో అదనంగా మరొక బ్యాట్స్‌మన్‌ను తీసుకోవచ్చు.(ఇక్కడ చదవండి: రిషభ్‌ పరిస్థితి ఏమిటి?)

దాంతో మన బ్యాటింగ్‌ బలం మరింత పెరుగుతుంది. రాహుల్‌ కీపర్‌గా రాణించాడు. బ్యాటింగ్‌లో కూడా ఆకట్టుకున్నాడు. ఈ పరిస్థితుల్లో కీపర్‌గా రాహుల్‌ను తప్పించాల్సిన అవసరం మాకు కనిపించడం లేదు. ఆసీస్‌తో ఆడిన భారత ఎలెవన్‌ను మార్చాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. 2003 వరల్డ్‌కప్‌లో రాహుల్‌ ద్రవిడ్‌ భాయ్‌ కీపింగ్‌ చేయడం చూశాం. దాంతో జట్టులో సమతుల్యత వచ్చింది. ఆ క‍్రమంలోనే సానుకూలమైన క్రికెట్‌ను మనోళ్లు ఆడారు. అదనంగా బ్యాట్స్‌మన్‌ ఉండటం వల్ల మరింత ఆత్మవిశ్వాసంతో ఆడతాం. ఇక కీపర్‌గా కేఎల్‌ రాహుల్‌ కొనసాగుతాడు’ అని కోహ్లి తెలిపాడు. (ఇక్కడ చదవండి: ‘రాహుల్‌ ఔటైన తర్వాత అదే అనుకున్నాం’)

>
మరిన్ని వార్తలు