కోహ్లి ముంగిట మరో అరుదైన రికార్డు

7 Aug, 2019 19:25 IST|Sakshi

గయానా: టీమిండియా పరుగుల యంత్రం, సారథి విరాట్‌ కోహ్లి మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయిన ఈ స్టార్‌ బ్యాట్స్‌మన్‌.. వెస్టిండీస్‌తో జరిగిన టి20 సిరీస్‌లో మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు.  గురువారం నుంచి ఆరంభం కానున్న మూడు వన్డేల సిరీస్‌లో కోహ్లి మరో రికార్డును సృష్టించే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో కోహ్లి 144 పరుగులు సాధిస్తే విండీస్‌ మాజీ ఆటగాడు రామ్‌నరేశ్‌ శర్వాన్‌ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొడతాడు. వెస్టిండీస్‌ గడ్డపై టీమిండియా-విండీస్‌ వన్డే సిరీస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో శర్వాన్‌( 17 మ్యాచ్‌ల్లో 700 పరుగులు) ఆగ్రస్థానంలో ఉన్నాడు. అయితే కోహ్లి ఇప్పటివరకు కరేబియన్‌ గడ్డపై 12 వన్డేల్లో 55.60 సగటుతో 556 పరుగులు సాధించాడు. దీంతో ఈ సిరీస్‌లోనే కోహ్లి ఈ రికార్డును అధిగమిస్తాడని అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు. 

అంతేకాకుండా విండీస్‌ విధ్వంసకర ఆటగాడు క్రిస్‌ గేల్‌ కూడా శర్వాన్‌, కోహ్లి రికార్డులపై కన్నేశాడు. ఇప్పటివరకు 512 పరుగులు సాధించిన గేల్‌కు శర్వాన్‌ రికార్డును అందుకోవడం అంత కష్టమేమి కాదు. టీమిండియాతో సిరీస్‌ అనంతరం గేల్‌ వీడ్కోలు పలకనున్నాడు. దీంతో ఈ సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన చేసి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఓవరాల్‌గా భారత్‌-వెస్టిండీస్‌ వన్డే సిరీస్‌లలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కోహ్లి రికార్డు సృష్టించాడు. అతడు 33 మ్యాచ్‌ల్లో 70.81 సగటుతో 1912 పరుగులు సాధించాడు. అతడి తర్వాత మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌ 39 మ్యాచ్‌ల్లో 1573 పరుగులు సాధించి రెండో స్థానంలో ఉన్నాడు. 

>
మరిన్ని వార్తలు