అందులో వాస్తవం లేదు: కోహ్లి

11 Jan, 2020 10:31 IST|Sakshi

పుణె: తమ అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడంలో భారత క్రికెటర్లు పోటీ పడటంతో అది మేనేజ్‌మెంట్‌కు కాస్త తలనొప్పిగానే మారింది. ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ జరుగనున్న తరుణంలో జట్టు ఎంపికపై అప్పుడే ఊహాగానాలు ఆరంభమయ్యాయి. ఈ క‍్రమంలోనే పలువురు మాజీలు తమ జట్టులను కూడా ప్రకటించేస్తున్నారు. దీనిలో భాగంగా ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ కంటే కేఎల్‌ రాహులే అత్యుత్తుమని కృష్ణమాచారి శ్రీకాంత్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌లు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతోనే శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్‌లో వీరిద్దరూ పోటీ పడి పరుగులు తీశారని అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (ఇక్కడ చదవండి: లక్ష్మణ్‌ ఓటు పంత్‌కే.. ధోనికి కాదు!)

ప్రధానంగా లంకేయులతో చివరి టీ20లో ధావన్‌ బ్యాట్‌ ఝుళిపించడానికి అదే కారణమని వాదన ఎక్కువవైంది. కాకపోతే దీనిని కోహ్లి ఖండించాడు. ‘ముగ్గురు ఓపెనర్లు సత్తా కలిగినవారైతే ప్రత్యామ్నాయాలకు మంచి అవకాశం ఉంటుంది. ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారనే మాటలు నేను నమ్మను. ఈ వ్యాఖ్యల్లో వాస్తవం లేదు. ఇది టీమ్‌గా అందరూ గుర్తించాలి’ అని కోహ్లి పేర్కొన్నాడు.ఇక ఏడాది ఆరంభపు సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేయడంపై కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. ‘కొత్త ఏడాదిలో శుభారంభం లభించింది. సరైన దిశలో అడుగు వేశాం. రెండు మ్యాచ్‌లలో చక్కటి ప్రదర్శన పట్ల సంతోషంగా ఉన్నా. 200 పరుగుల స్కోరు దాటితే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిడిలార్డర్‌ విఫలమైనా పాండే, శార్దుల్‌ ఆదుకున్నారు. సీనియర్‌ ఆటగాళ్లు విఫలమైతే ఎవరు బాధ్యత తీసుకోగలరో చూడాలంటే ఇలాంటి సందర్భాలు మరిన్ని రావాలి. ముందుగా బ్యాటింగ్‌ చేస్తే భారీ స్కోరు సాధించి చూపించాలి. ఈ రోజు మ్యాచ్‌లో 180 చేయగలమనుకుంటే అంతకంటే ఎక్కువే చేశాం’ అని కోహ్లి తెలిపాడు.(ఇక్కడ చదవండి:లాంఛనం పూర్తయింది)

మరిన్ని వార్తలు