వారిద్దరే క్రికెట్‌ జట్టును నాశనం చేస్తున్నారు!

23 Aug, 2019 14:00 IST|Sakshi

ఆంటిగ్వా: రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వివ్ రిచర్డ్స్ స్టేడియంలో గురువారం వెస్టిండిస్‌, భారత్ జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే. తొలి టెస్టుకు 'హిట్ మ్యాన్' ఓపెనర్ రోహిత్ శర్మ, సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. దీంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై ట్విట్టర్‌లో విమర్శల వర్షం కురుస్తోంది. పలువురు మాజీలు సైతం తీవ్రంగా విమర్శించారు.

గత ప్రపంచకప్‌లో రోహిత్ సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే. ఏకంగా ఐదు సెంచరీలు చేసి అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. విండీస్ పర్యటనలో ఓ అర్ధ సెంచరీ చేసి మోస్తరుగా రాణించాడు. ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా అర్ధ సెంచరీ చేసాడు. అయినా రోహిత్‌ను పక్కనబెట్టాడు. దీంతో కోహ్లి-రోహిత్ మధ్య విబేధాలు అలానే ఉన్నాయని అభిమానులు అంటున్నారు.

'విరాట్ కోహ్లి నిజంగా ఒక ఇడియట్, స్టుపిడ్ కెప్టెన్ అని నిరూపించాడు. ఒక్క ఐపీఎల్ ట్రోఫీ గెలవని కోహ్లి.. రోహిత్ శర్మను పక్కన పెట్టాడు' అని ఓ అభిమాని ఘాటుగా విమర్శించాడు. 'కోహ్లి-రోహిత్ మధ్య విబేధాలు అలానే ఉన్నాయనడానికి ఇదే నిదర్శనం' అని మరో అభిమాని ట్వీట్ చేసాడు. 'కోహ్లికి ఇష్టమైన ఫెయిల్యూర్‌ ఆటగాడు కేఎల్ రాహుల్ జట్టులో ఉన్నాడు. కానీ.. రోహిత్ లేడు. కోహ్లి సొంత ప్రయోజనాల కోసం జట్టును నాశనం చేస్తున్నాడు. రవిశాస్త్రి-కోహ్లిల కాంబినేషనే టీమిండియాకు ప్రమాదం. వీరిద్దరే క్రికెట్‌ జట్టును నాశనం చేస్తున్నారు' అని ఓ అభిమాని మండిపడ్డాడు. మరొకవైపు కోహ్లి అభిమానులు ఇందుకు ధీటుగానే బదులిస్తున్నారు. టెస్టుల్లో రోహిత్‌ విఫలమైన ఆటగాడు కాబట్టే చోటు దక్కలేదని కోహ్లి ఫ్యాన్స్‌ విమర్శిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు