రోహిత్‌తో వివాదం.. కోహ్లి వస్తాడా..రాడా?

28 Jul, 2019 12:38 IST|Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య విబేధాలు తలెత్తాయని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది.   ఈ వార్తలు తప్పని కూడా భారత క్రికెట్‌ కంట్రోల్‌(బీసీసీఐ) వర్గాలు పేర్కొన్నాయి.  ఇదంతా మీడియా సృష్టేనని భారత క్రికెట్‌ పరిపాలక కమిటీ చీఫ్‌ వినోద్‌ రాయ్‌ కూడా స్పష్టం చేశారు. కాగా, కోహ్లి-రోహిత్‌ల మధ్య వర్గ పోరు నడుస్తోందనేది కొన్ని పరిణామాల్ని బట్టి నిజమేనని అనిపిస్తోంది. వీటిపై ఇప్పటివరకూ కోహ్లి కానీ, రోహిత్‌ కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు.

మరి ఇప్పుడు వెస్టిండీస్‌ పర్యటనకు టీమిండియా సిద్ధమవుతోంది. సోమవారం విండీస్‌ పర్యటనకు భారత క్రికెట్‌ జట్టు బయల్దేరి వెళ్లనుంది. అయితే విండీస్‌ పర్యటనకు వెళ్లే ముందు నిర్వహించే ప్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు కెప్టెన్‌ హోదాలో కోహ్లి హాజరవుతాడా.. లేదా అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. రోహిత్‌తో వివాదం వార్తల నేపథ్యంలో ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు దూరంగా ఉండాలని కోహ్లి భావిస్తున్నాడట. అక్కడ మీడియా నుంచి ఎదురయ్యే ప్రశ్నలతో కొత్త వివాదం వస్తుందనే భావించే కోహ్లి అసలు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కే హాజరు కాకూడదని నిర్ణయించుకున్నాడనేది సమాచారం.(ఇక్కడ చదవండి: అగ్గి రాజేసిన రోహిత్‌ ‘అన్‌ఫాలో’ వివాదం!)

ఇందుకు శనివారం ముంబైలో తొలి అంచె కబడ్డీ మ్యాచ్‌కు హాజరైన కోహ్లి.. మీడియా సమావేశానికి మాత్రం దూరంగా ఉన్నాడు. దీని కోసం ముందస్తు ఏర్పాట్లు చేసిన తర్వాత దాన్ని రద్దు చేశారు. ఈ నేపథ్యంలో విండీస్‌ పర్యటనకు వెళ్లే ముందు ప్రి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు కోహ్లి డుమ్మా కొట్టనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఒక పర్యటనకు వెళ్లే ముందు ప్రి ప్రెస్‌ కాన్పరెన్స్‌ను నిర్వహించడం సాధారణంగా జరుగుతోంది. ఆ సమయంలో కెప్టెన్‌ హోదాలో ఉన్న వ్యక్తే పర్యటనకు సంబంధించి వివరాలను వెల్లడిస్తాడు. మరి కోహ్లి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌కు హాజరవుతాడా.. లేదా అనేది చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తలు