రాంచీ: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి అంపైర్ నిర్ణయ పునః సమీక్ష పద్ధతి(డీఆర్ఎస్) ఫీవర్ పట్టుకుంది. గత రెండేళ్లలో టెస్టు ఫార్మాట్లో ఒక బ్యాట్స్మన్గా తాను కోరిన ప్రతీ డీఆర్ఎస్ను కోల్పోవడమే అందుకు ఉదాహరణ. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో కోహ్లి తన ఔట్ విషయంలో రివ్యూకు వెళ్లినా ప్రతికూల ఫలితం చవిచూశాడు. 2017లో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్లో బ్యాటింగ్ చేస్తుండగా డీఆర్ఎస్కు వెళ్లిన కోహ్లికి నిరాశే ఎదురైంది. అప్పట్నుంచి ఇప్పటివరకూ కోహ్లి తన వ్యక్తిగత ఔట్పై డీఆర్ఎస్ వెళ్లినా ప్రతీ సందర్భంలోనూ చుక్కెదురవుతూ వస్తోంది. ఒక బ్యాట్స్మన్గా టెస్టుల్లో డీఆర్ఎస్కు వెళ్లిన సందర్భాల్లో కోహ్లికి వరుసగా 9సార్లు నిరాశ ఎదురుకావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం.
శనివారం ప్రారంభమైన మూడో టెస్టులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్(10) తొలి వికెట్గా పెవిలియన్ చేరితే, కాసేపటికి చతేశ్వర పుజారా డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఆడిన పుజారా తన పరుగుల ఖాతా తెరవకుండానే నిష్క్రమించాడు. కాగా, అటు తర్వాత క్రీజ్లోకి వచ్చిన కోహ్లి రెండు ఫోర్లతో ఊపు మీద కనిపించాడు. కాకపోతే దక్షిణాఫ్రికా పేసర్ నార్జీ వేసిన బంతికి కోహ్లి వికెట్లు ముందు దొరికిపోయాడు. ఈ క్రమంలోనే క్రీజ్లో ఉన్న రోహిత్ శర్మను సంప్రదించిన తర్వాత కోహ్లి డీఆర్ఎస్కు వెళ్లాడు. బంతి లెగ్ స్టంప్ బయటకు వెళుతుందని భావించిన కోహ్లి ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని సవాల్ చేశాడు. అయితే బంతి స్వల్పంగా లెగ్ వికెట్ బెయిల్ను తాకుతున్నట్లు రిప్లేలో కనిపించింది. ఈ నిర్ణయాన్ని ఫీల్డ్ అంపైర్కే వదిలేయడంతో కోహ్లి నిరాశగా వెనుదిరిగాడు. కెప్టెన్గా డీఆర్ఎస్ విషయంలో ఫర్వాలేదనిపిస్తున్న కోహ్లి.. బ్యాట్స్మన్గా మాత్రం విఫలం కావడం మాత్రం చర్చనీయాంశమైంది.