కోహ్లిని ఇబ్బంది పెట్టిన ప్రశ్న!

7 Jul, 2017 15:25 IST|Sakshi
కోహ్లిని ఇబ్బంది పెట్టిన ప్రశ్న!

కింగ్స్టన్: మహేంద్ర సింగ్ ధోని వారసుడిగా భారత క్రికెట్ జట్టును ముందుకు తీసుకువెళుతున్న సారథి విరాట్ కోహ్లి. అయితే ఇటీవల ధోని రిటైర్మెంట్ గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. మరో రెండేళ్లలో వచ్చే వన్డే వరల్డ్ కప్ లో ధోని ఉంటాడా లేదా  అనేది ప్రధానమైన చర్చ. ఈ క్రమంలోనే ధోని వీడ్కోలు గురించి విరాట్ కోహ్లికి తాజాగా ఊహించని ప్రశ్న ఎదురైంది. వెస్టిండీస్ పర్యటనలో భాగంగా భారత జట్టు ఐదో వన్డే గెలిచి సిరీస్ ను కైవసం చేసుకున్న అనంతరం కోహ్లిని ధోని గురించి ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్న ఇబ్బంది పెట్టింది. ధోని రిటైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది అనే ప్రశ్నకు కోహ్లి ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు.

కోహ్లికి ఎదురైన ఊహించన ప్రశ్నకు ఏమి చెప్పాలో కాసేపు అర్ధం కాలేదు. ఆపై సముదాయించుకుని తనదైన శైలిలో ముగించాడు.' భారత క్రికెట్ జట్టు అత్యంత సక్సెస్ఫుల్ కెప్టెన్ ధోని. అతని గురించి మేము చెప్పడానికి ఏమీ లేదు. ధోని ఎప్పుడు రిటైర్ కావాలి అనేది అతనికి తెలుసు. అతను బంతిని చక్కగా స్టైక్ చేస్తున్నాడు. అసలు గేమ్ ఎలా ఆడాలో ధోనికి చెప్పాల్సిన అవసరం లేదు. మ్యాచ్ పరిస్థితిని బట్టి ధోని ఆడతాడు. ఇన్నింగ్స్ ను ఎలా నిలబెట్టాలో ధోనికి బాగా తెలుసు'అని కోహ్లి బదులిచ్చాడు.

>
మరిన్ని వార్తలు