ఇలా చేయడం అప్పట్నుంచే: కోహ్లి

17 Jun, 2019 18:59 IST|Sakshi

మాంచెస్టర్ ‌: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా తిలకించిన భారత్‌-పాకిస్తాన్‌ మ్యాచ్‌లో కోహ్లి సేననే పైచేయి సాధించింది. ఆదివారం మాంచెస్టర్‌ వేదికగా జరిగిన దాయాదుల పోరులో భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. ఇక పాక్‌తో మ్యాచ్‌ అనంతరం మరో మ్యాచ్‌కు సమయం ఉండటంతో ఆటగాళ్లు సేదతీరుతున్నారు. అయితే మ్యాచ్‌ అనంతరం టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి షేర్‌ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేస్తోంది.
మామూలుగా మ్యాచ్‌లో కోహ్లి హావ భావాలు, అతడు ఇచ్చే స్టిల్స్‌(కావాలని కాదు) అత్యంత ఆసక్తికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఫ్యాన్స్‌ను అలరిస్తూ.. వారు హద్దులు దాటితే మందిలిస్తూ కోహ్లి వార్తల్లో నిలుస్తుంటాడు. పాక్‌తో మ్యాచ్‌లో వర్షం వస్తున్న సమయంలో విరాట్ కోహ్లీ అసంతృప్తితో ఆకాశం వైపు చూస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తన చిన్ననాటి ఫోటోతో పాటు పాక్‌తో మ్యాచ్ సందర్భంగా తీసిన ఫోటోలను జతచేసి ట్వీట్ చేశారు. 90ల నుంచి ఇలా చేస్తున్నానని పేర్కొన్నాడు. ‘ఇలా చేయడం 90ల నుంచే’అంటూ ఫోటో కింద క్యాప్షన్‌ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ప్రపంచకప్‌లో పాక్‌పై విజయానంతరం సోషల్‌ మీడియా వేదికగా టీమిండియా క్రికెటర్లకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. భారతీయులు గర్వించేలా ఆడారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.

 

మరిన్ని వార్తలు