హంపికి మూడో విజయం

15 Feb, 2020 10:01 IST|Sakshi

సెయింట్‌ లూయిస్‌ (అమెరికా): కెయిన్స్‌ కప్‌ అంతర్జాతీయ చెస్‌ టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌ గ్రాండ్‌మాస్టర్, మహిళల విభాగంలో భారత నంబర్‌వన్‌ కోనేరు హంపి మూడో విజయం నమోదు చేసింది. ప్రపంచ మాజీ చాంపియన్‌ అలెగ్జాండ్రా కొస్టెనిక్‌ (రష్యా)తో జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌లో హంపి 61 ఎత్తుల్లో గెలుపొందింది. ఆంధ్రప్రదేశ్‌కే చెందిన మరో గ్రాండ్‌మాస్టర్‌ ద్రోణవల్లి హారిక ఖాతాలో నాలుగో ‘డ్రా’ చేరింది.

ప్రపంచ చాంపియన్‌ జూ వెన్‌జున్‌ (చైనా)తో జరిగిన ఆరో రౌండ్‌ గేమ్‌ను హారిక 40 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. పది మంది అగ్రశ్రేణి క్రీడాకారిణుల మధ్య తొమ్మిది రౌండ్లపాటు జరుగుతున్న ఈ టోర్నీలో ఆరో రౌండ్‌ తర్వాత హంపి, జూ వెన్‌జున్‌ నాలుగు పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో ఉన్నారు. హారిక మూడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.   
 

మరిన్ని వార్తలు