విజేత కోఠి ఉమెన్స్‌ కాలేజి

8 Sep, 2018 10:05 IST|Sakshi

ఓయూ ఇంటర్‌ కాలేజిమహిళల ఖో–ఖో చాంపియన్‌షిప్‌  

సాక్షి, హైదరాబాద్‌: ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) ఇంటర్‌ కాలేజి మహిళల ఖో–ఖో చాంపియన్‌షిప్‌లో ఆతిథ్య కోఠి ఉమెన్స్‌ కాలేజి జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కోఠి ఉమెన్స్‌ జట్టు 10–1తో సెయింట్‌ ఆన్స్‌ (మెహిదీపట్నం) కాలేజీని చిత్తుగా ఓడించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో వికారాబాద్‌ సాంఘిక సంక్షేమ కాలేజి జట్టు 4–1తో ఎల్బీనగర్‌ సాంఘిక సంక్షేమ కాలేజిపై గెలుపొందింది.

అంతకుముందు జరిగిన సెమీస్‌ మ్యాచ్‌ల్లో కోఠి ఉమెన్స్‌ జట్టు 11–1తో వికారాబాద్‌ సాంఘిక సంక్షేమ కాలేజిపై, సెయింట్‌ ఆన్స్‌ (మెహిదీపట్నం) 16–2తో ఎల్బీ నగర్‌ సాంఘిక సంక్షేమ కాలేజిపై విజయం సాధించాయి. పోటీల అనంతరం జరిగిన బహుమతి ప్రదాన కార్యక్రమంలో నిజాం కాలేజి ప్రిన్సిపాల్‌ ఎల్‌బీ లక్ష్మీకాంత్‌ రాథోడ్‌ ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు ట్రోఫీని అందజేశారు. ఈ కార్యక్రమంలో కోఠి ఓయూసీడబ్ల్యూ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ రోజారాణి, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి వి. దీపిక, ఓయూ ఐసీటీఎస్‌ కార్యదర్శి బి. సునీల్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు