ముంబై: ఒక బంతికి ఒక వికెట్ను మాత్రమే మనం తరచు చూస్తూ ఉంటాం. అయితే ఒకే బంతికి రెండు వికెట్లు లభిస్తే అదొక అరుదైన సందర్భమే. ఐపీఎల్ తాజా సీజన్లో భాగంగా ముంబై ఇండియన్స్-రాయల్ చాలెంజర్స్ మ్యాచ్లో ఇది చోటు చేసుకుంది. ఆర్సీబీ ఇన్నింగ్స్లో భాగంగా మన్దీప్ సింగ్, కోరీ అండర్సన్లు ఇలా ఒకే బంతికి ఔటై వార్తల్లో నిలిచారు.
ముంబై బౌలర్ కృనాల్ పాండ్యా వేసిన 10 ఓవర్ నాల్గో బంతికి మన్దీప్ సింగ్ ఔట్ కాగా, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మన్ కోరీ అండర్సన్ డకౌట్గా పెవిలియన్ చేరాడు. అయితే వైడ్ అయిన ఆ నాల్గో బంతికి ముందుగా మన్దీప్ సింగ్ స్టంప్ ఔట్గా వెనుదిరగ్గా, వెంటనే కోరీ అండర్సన్ భారీ షాట్కు యత్నించి పెవిలియన్ బాటపట్టాడు. దాంతో ఆ ఓవర్ నాలుగో బంతికే ఇద్దరు ఆటగాళ్లు పెవిలియన్ చేరాల్సి రాగా, ఆ రెండు వికెట్లు కృనాల్ ఖాతాలో వెళ్లాయి. ముంబై విసిరిన 214 పరుగుల లక్ష్య ఛేదనలో ఆర్సీబీ.. 40 పరుగుల వద్ద డీకాక్(19) వికెట్ను కోల్పోగా, 42 పరుగుల వద్ద ఏబీ డివిలియర్స్(1)ను వికెట్ను కోల్పోయింది. అటు తర్వాత 33 పరుగుల వ్యవధిలో వరుసగా రెండు వికెట్లను చేజార్చుకుంది. దాంతో ఆర్సీబీ 75 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.