వెల్లింగ్టన్: మూడు టీ20ల సిరీస్లో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా 80 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ నిర్దేశించిన 220 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా 139 పరుగులకే కుప్పకూలింది. ఈ ఓటమి తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయగా, బ్యాటింగ్ ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా సైతం నిరాశ వ్యక్తం చేశాడు. కివీస్ బ్యాటింగ్, బౌలింగ్ ముందు సమష్టిగా విఫలమయ్యామన్నాడు. ‘ మా ఓటమికి ప్రధాన కారణం ఒత్తిడి. ప్రధానంగా న్యూజిలాండ్ స్కోరు బోర్డును చూసిన తర్వాత మాపై ఒత్తిడి నెలకొంది. ఆ ఒత్తిడితోనే బ్యాటింగ్లో ఘోర వైఫల్యం చవిచూశాం. ఇక్కడ క్రెడిట్ అంతా న్యూజిలాండ్కే ఇవ్వాలి. వారు బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ విపరీతంగా ఆకట్టుకున్నారు. మేము వేసిన కొన్ని లూజ్ డెలివరీలు కివీస్ భారీ స్కోరు చేయడానికి దోహదం చేశాయి’ అని కృనాల్ పేర్కొన్నాడు.
ఇక ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడ వాతావరణంతో ఏమైనా ఇబ్బందులు ఎదురయ్యాయా అని అడగ్గా, అటువంటిది ఏమీ లేదని కృనాల్ తెలిపాడు. ‘ వెల్లింగ్టన్ మైదానంలో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదన్నాడు. ఆడటానికి అనుకూలమైన వాతావరణమే ఇక్కడ ఉంది. మాకు క్యాచ్లు పట్టే విషయంలో కూడా ఎటువంటి సమస్యలూ తలెత్త లేదు. ఆటలో క్యాచ్లు జారవిడచడం అనేది గేమ్లో భాగమే. అంతేకానీ వాతావరణం కారణం కాదు’ అని స్పష్టం చేశాడు. కివీస్తో తొలి టీ20లో ఒక వికెట్ తీసిన కృనాల్.. బ్యాటింగ్లో 20 పరుగులు చేశాడు.