టోక్యో ఒలింపిక్స్‌కు ఇర్ఫాన్ అర్హత  

18 Mar, 2019 01:34 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌ క్రీడలకు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రేస్‌ వాకర్‌ కేటీ ఇర్ఫాన్ నిలిచాడు. ఆదివారం జపాన్ లోని నోమిలో జరిగిన ఆసియా రేస్‌ వాకింగ్‌ చాంపియన్షిప్‌లో ఇర్ఫాన్ 20 కిలోమీటర్ల నడక విభాగంలో నాలుగో స్థానంలో నిలిచాడు. అతను 20 కిలో మీటర్ల దూరాన్ని గంటా 20 నిమిషాల 57 సెకన్లలో పూర్తి చేసి టోక్యో ఒలింపిక్స్‌ అర్హత ప్రమాణాన్ని (గంటా 21 నిమిషాలు) అధిగమించాడు.

అంతేకాకుండా సెప్టెంబర్‌–అక్టోబర్‌లో దోహా వేదికగా జరిగే ప్రపంచ అథ్లెటిక్స్‌ చాంపియన్షిప్‌నకు (అర్హత ప్రమాణం: గంటా 22 నిమిషాల 30 సెకన్లు) కూడా ఇర్ఫాన్ అర్హత పొందాడు. భారత్‌కే చెందిన మరో ఇద్దరు వాకర్లు దేవిందర్‌ సింగ్‌ (గంటా 21ని.22 సెకన్లు), గణపతి కృష్ణన్ (గంటా 22ని.12 సెకన్లు) కూడా ప్రపంచ చాంపియన్షిప్‌నకు బెర్త్‌లు దక్కించుకున్నారు. కేరళకు చెందిన 29 ఏళ్ల ఇర్ఫాన్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో పదో స్థానాన్ని పొందాడు.   

మరిన్ని వార్తలు