కుల్దీప్‌ యాదవ్‌ విజృంభణ

15 May, 2018 21:48 IST|Sakshi

కోల్‌కతా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)లో భాగంగా ఇక్కడ  ఈడెన్‌ గార్డెన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 143 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కేకేఆర్‌ స్సిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ విజృంభించి బౌలింగ్‌ చేయడంతో రాజస్తాన్‌ సాధారణ స్కోరుకే పరిమితమైంది. తన నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటాలో కుల్దీప్‌ 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో రాజస్తాన్‌ను దెబ్బ తీశాడు. అతనికి జతగా ఆండ్రీ రస్సెల్‌, ప్రసిధ్‌ కృష్ణలు చెరో రెండు వికెట్లు సాధించగా, మావి, సునీల్‌ నరైన్‌ తలో వికెట్‌ తీశారు.

టాస్‌ ఓడి తొలుత బ‍్యాటింగ్‌ చేపట్టిన రాజస్తాన్‌కు శుభారంభం లభించింది. రాజస్తాన్‌ ఓపెనర్లు రాహుల్‌ త్రిపాఠి, జోస్‌ బట్లర్‌లు ధాటిగా ఇన్నింగ్స్‌ ఆరంభించారు. వీరిద్దరూ కలిసి 4.5 ఓవర్లలో 63 పరుగులు జత చేసిన తర్వాత రాహుల్‌ త్రిపాఠి(27;15 బంతుల్లో4 ఫోర్లు, 1 సిక్సర్‌) తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. ఆపై మరో 13 పరుగుల వ్యవధిలో అజింక్యా రహానే(11) రెండో వికెట్‌గా ఔటయ్యాడు. కాసేపటికి బట్లర్‌(39; 22 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) నిష్ర్కమించడంతో రాజస్తాన్‌ 85 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఇక అటు తర్వాత రాజస్తాన్‌ రాయల్స్‌ ఏ దశలోనూ తేరుకోలేదు. వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ అందివచ్చిన చక్కటి ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు. సంజూ శాంసన్‌(12),  స్టువర్ట్‌ బిన్నీ(1), గౌతమ్‌(3), స్టోక్స్‌(11)లు ఇలా వచ్చి అలా పెవిలియన్‌ చేరారు. ఇక చివర్లో ఉనాద్కత్‌(2​‍​‍6;18 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌) ఫర‍్వాలేదనిపించాడు. కాగా, ఆఖరి వికెట్‌గా ఉనాద్కత్‌ వెనుదిరగడంతో రాజస్తాన్‌ రాయల్స్‌ 19 ఓవర్లలో 142 పరుగులకు ఆలౌటైంది.

మరిన్ని వార్తలు