సాక్షి, సిటీబ్యూరో: కేంద్రీయ విద్యాలయ (కేవీ) బ్యాడ్మింటన్ పోటీలు శనివారం ముగిశాయి. ఉప్పల్ కేవీ-2 పాఠశాల ఆధ్వర్యంలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలలో హైదరాబాద్ రీజియన్ నుంచి సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్-14, 17, 19 బాలబాలికల విభాగాల్లో జరిగిన ఈ పోటీలను బ్యాడ్మింటన్ రిఫరీ ఫణిరావు పర్యవేక్షించారు.
ఉత్కంఠ భరితంగా సాగిన ఈ పోటీల్లో కేంద్రీయ విద్యాలయ గచ్చిబౌలి, కేవీ (ఓఎన్జీసీ) రాజమండ్రి, కేవీ ఎన్టీపీసీ రామగుండం, కేవీ హైదరాబాద్ జట్లు టీమ్ చాంపియన్షిప్లను సాధించాయి. వ్యక్తిగత పోటీల్లో కేవీ కడపకు చెందిన పద్మిని, గచ్చిబౌలి కేవీకి చెందిన నిఖిల్ రాజ్, కేవీ శివరాంపల్లికి చెందిన శివకుమార్ విజేతలుగా నిలిచారు. వీరికి ఉప్పల్, కేవీ-2 ప్రిన్సిపాల్ రాధ మహాలక్ష్మి పతకాలు అందజేశారు. ఈ ఈవెంట్లో సత్తాచాటిన 30 మంది విద్యార్థులను జాతీయ స్థాయి కేంద్రీయ విద్యాలయ పోటీలకు ఎంపిక చేశారు.