‘ల లీగా’ భారత అంబాసిడర్‌గా రోహిత్‌

13 Dec, 2019 02:01 IST|Sakshi
ల లీగా బ్రాండ్‌ అంబాసిడర్‌గా రోహిత్‌ శర్మ

ముంబై: భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ‘ల లీగా’ భారత ప్రచారకర్తగా వ్యవహరిస్తాడు. క్రికెట్‌ క్రేజ్‌ ఉన్న భారత్‌లో ఫుట్‌బాల్‌ను అనుసరించేవాళ్ల సంఖ్య పెంచేందుకు ‘ల లీగా’ వర్గాలు స్టార్‌ బ్యాట్స్‌మన్‌ను తమ బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ సందర్భంగా ‘హిట్‌మ్యాన్‌’ మీడియాతో మాట్లాడుతూ... టీమిండియాలో ఫుట్‌బాల్‌ అభిమానులు చాలామందే ఉన్నారని హార్దిక్‌ పాండ్యా, లోకేశ్‌ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌లైతే సాకర్‌ స్టార్లను బాగా అనుసరిస్తారని, వాళ్ల హెయిర్‌ స్టయిల్‌ను కూడా అలాగే మార్చుకున్నారని చెప్పాడు.

టీమిండియాలో బెస్ట్‌ ఫుట్‌బాలర్‌ ఎవరనే ప్రశ్నకు సమాధానమిస్తూ ‘ధోని తమ జట్టులో నంబర్‌వన్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ అని చెప్పాడు. స్వీడన్‌ స్టార్‌ జ్లాటన్‌ ఇబ్రహిమోవిచ్‌ పోలికలతో ఉన్న ఇషాంత్‌ శర్మను ఉద్దేశించి ‘ఇప్పటికే మా జట్టులో జ్లాటన్‌ రూపంలో ఇషాంత్‌ ఉన్నాడుగా’ అని చమత్కరించాడు. భారత్‌లో ఇండియన్‌ సూపర్‌ లీగ్‌ (ఐఎస్‌ఎల్‌) పుణ్యమాని ఫుట్‌బాల్‌కు ఆదరణ అంతకంతకూ పెరుగుతోందని ఫ్రాన్స్‌ సాకర్‌ స్టార్‌ జిదాన్‌ అభిమాని అయిన రోహిత్‌ చెప్పాడు. సాకర్‌లో సత్తాగల కుర్రాళ్లకు ఐఎస్‌ఎల్‌ మంచి వేదికని అన్నాడు. స్పెయిన్‌లో ప్రముఖ ఫుట్‌బాల్‌ లీగ్‌ అయిన ‘ల లీగా’కు ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉంది.

మరిన్ని వార్తలు