ఇక మిగిలింది 2020

26 Dec, 2019 01:08 IST|Sakshi
లియాండర్‌ పేస్‌

మూడు దశాబ్దాల ఆటకు వీడ్కోలు పలుకనున్న భారత టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌

29 ఏళ్ల క్రితం... 16 ఏళ్ల ఒక టీనేజీ కుర్రాడు తొలిసారి భారత జట్టు తరఫున డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ ఆడాడు. డబుల్స్‌ మ్యాచ్‌లో సీనియర్‌ సహచరుడు జీషాన్‌ అలీతో కలిసి ఐదు సెట్ల సుదీర్ఘ పోరులో జపాన్‌పై భారత్‌ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. నాటి అతని పోరాటపటిమ ఒక్కసారిగా టెన్నిస్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.

ఇప్పుడు 46 ఏళ్ల ప్రాయంలోనూ కూడా అదే ఉత్సాహం, అదే జోరు... పాయింట్, గేమ్, సెట్, మ్యాచ్‌... దినచర్యలో భాగంగా మారిపోయిన ఈ అంకెల కోసం కోర్టు నలుమూలలా పరుగెత్తుతూనే ఉన్న ఆ శరీరానికి అలసట వచ్చేసింది. వయసును గెలిచిన ‘ఆ కుర్రాడు’ వచ్చే ఏడాది తన మూడు దశాబ్దాల టెన్నిస్‌ కెరీర్‌కు ముగింపు పలకాలని నిర్ణయించుకున్నాడు.   

సాక్షి క్రీడా విభాగం  
18 గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌... ఒలింపిక్స్‌లో కాంస్య పతకం... 55 కెరీర్‌ టైటిల్స్‌... ఇవన్నీ ఒక ఎత్తయితే, ‘వయసు’ దాటిన తర్వాత తన పేర వరుసగా లిఖించుకుంటూ వస్తున్న రికార్డులకైతే అంతే కనిపించడం లేదు. అలసిపోవడం లేదు, ఫిట్‌నెస్‌ సమస్యలు అసలే లేవు, కాలు నొప్పితోనో, వేలు నొప్పితోనో ఆటకు దూరమైన రోజులే లేవు... ఈ  మనిషికి ఎలా సాధ్యం. మూడు పదులు దాటగానే కెరీర్‌ చరమాంకంలోకి వచి్చందని చాలా మంది భావించే ఆటలో 46 ఏళ్ల వయసు వచి్చనా గ్రాండ్‌గా ఆడి చూపిస్తున్న అద్భుతం పేరే లియాండర్‌ పేస్‌.

అతను తొలి డేవిస్‌ కప్‌ మ్యాచ్‌ ఆడిన  రోజు నుంచి డేవిస్‌ కప్‌లో కొత్త రికార్డు సృష్టించే వరకు టెన్నిస్‌లో తరం మారిపోయింది. అతను వచ్చే సమయానికి స్టీఫెన్‌ ఎడ్‌బర్గ్, బోరిస్‌ బెకర్, ఇవాన్‌ లెండిల్‌లాంటి వాళ్లు ఆటకు గుడ్‌బై చెప్పే దశలో ఉన్నారు. ఆ తర్వాత సంప్రాస్, అగస్సీలతో సమాంతరంగా పేస్‌ కెరీర్‌ సాగింది. ఇప్పుడు ఫెడరర్, నాడల్, జొకోవిచ్‌ల కాలంలోనూ పేస్‌ రాకెట్‌ మాట్లాడుతూనే ఉంది. పేస్‌ ఆడేది డబుల్స్‌లోనే అయినా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ పరంగా చూస్తే అదేమీ తక్కువ శ్రమతో కూడింది కాదు. టీమ్‌ గేమ్‌ అయిన క్రికెట్‌లో 24 ఏళ్లు ఆడిన సచిన్‌ను ఆశ్చర్యంతో భారత క్రీడాభిమానులు చూశారు. కానీ టెన్నిస్‌లాంటి క్రీడలో 29 ఏళ్లుగా సత్తా చాటడం పేస్‌లాంటి దిగ్గజానికే సాధ్యమైంది.  

అట్లాంటాతో అంబరాన...
పేస్‌ 1990లో జూనియర్‌ వింబుల్డన్‌... 1991లో జూనియర్‌ యూఎస్‌ ఓపెన్‌ గెలిచి వరల్డ్‌ నంబర్‌వన్‌గా నిలిచినప్పుడు  కూడా అతను ఇంత సుదీర్ఘకాలం సాగిపోగలడని ఎవరూ ఊహించలేదు. జూనియర్‌ స్థాయిలో సంచలనాలు చేసి అంతటితో సరిపెట్టే ఆటగాళ్ల జాబితాలోకి అతడిని చేర్చారు. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో వైఫల్యంతో అందరికీ అదే అనిపించింది. కానీ నాలుగేళ్ల తర్వాత పేస్‌ భారత జెండాను విశ్వవేదికపై రెపరెపలాడించాడు. నాడు 126వ ర్యాంక్‌లో ఉండి ఏ మాత్రం ఆశలు లేని స్థితిలో 44 ఏళ్ల తర్వాత భారత్‌కు వ్యక్తిగత ఒలింపిక్‌ పతకం అందించాడు. ఆ గెలుపుతో హీరోగా మారిన పేస్‌... ఇప్పటికీ తనపై నమ్మకాన్ని నిలబెట్టుకుంటూనే ఉన్నాడు. తన ఘనతలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాడు. ఒలింపిక్‌ పతకం మొదలు అనేక సంచలన విజయాలు పేస్‌ వెంట నడుస్తూ వచ్చాయి. ఈ పెద్ద జాబితాలో ఒకసారి సింగిల్స్‌లో పీట్‌ సంప్రాస్‌ను ఓడించిన చిరస్మరణీయ మ్యాచ్‌ కూడా ఉంది.  

డేవిస్‌ కప్‌ సూపర్‌ స్టార్‌...
పేస్‌కు సంబంధించి ప్రతీ భారతీయుడు మెచ్చే, అతని నుంచి ఆశించే విషయం డేవిస్‌ కప్‌ పోటీల్లో అతని అద్భుత ప్రదర్శన. ప్రత్యర్థి ఎదురుగా నిలబడగానే వాలి బలం రెట్టింపు అయిపోయినట్లు... భారత జట్టు తరఫున ఆడే సమయంలో పేస్‌ ఆటతీరు కూడా ఒక్కసారిగా అద్భుతంగా మారిపోతుంది. ఏటీపీ టోరీ్నల సంగతి ఎలా ఉన్నా... దేశానికి ప్రాతినిధ్యం వహించే సమయంలో అతని రాకెట్‌ మరింత పదునెక్కుతుంది. ఇన్నేళ్లలో అది ఎన్నోసార్లు నిరూపితమైంది. ఒలింపిక్స్‌ పతకం తర్వాత లియాండర్‌ ఆడిన అన్ని డేవిస్‌కప్‌ మ్యాచ్‌లలో ఇది పదే పదే కనిపించింది. తనలో కూడా కొత్త శక్తి వచ్చేస్తుందని అతను కూడా దీని గురించి చెప్పుకున్నాడు. ప్రత్యర్థి ఎంత బలమైన ఆటగాడు అయినా వీరోచిత ప్రదర్శనతో పేస్‌ డేవిస్‌ కప్‌లో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించాడు.  హెన్రీ లెకాంటే, ఇవాన్‌సెవిచ్, టిమ్‌ హెన్మన్, వేన్‌ ఫెరీరా తదిరులతో పాటు ఆ సమయంలో టాప్‌ ర్యాంక్‌లలో ఉన్న పలువురు ఆటగాళ్లపై వచి్చన స్ఫూర్తిదాయక విజయాలు ఈ జాబితాలోనివే.  1993లో డేవిస్‌కప్‌ వరల్డ్‌ గ్రూప్‌లో భారత్‌ సెమీస్‌ చేరడంలో పేస్‌దే కీలక పాత్ర.

మృత్యువుతో పోరాడి...
2003లో వింబుల్డన్‌ క్వార్టర్‌ ఫైనల్‌ ఆడుతున్న సమయంలో అటు వైపు కోర్టు నుంచి బంతి పేస్‌ వైపు వచ్చింది. సునాయాసంగా రిటర్న్‌ చేయాల్సిన అతను, ఏమీ చేయకుండా అలా బంతిని చూస్తుండిపోయాడు. ఎదురుగా అంతా చీకటి, కళ్లు బైర్లు కమ్మాయి. శరీరంపై నియంత్రణ లేక నిలబడేందుకు భాగస్వామి మారి్టనా నవ్రతిలోవాను పట్టుకున్నాడు. అది బ్రెయిన్‌ క్యాన్సర్‌ కావచ్చని, ఎంతో కాలం బతకడం కూడా కష్టమని ప్రాథమికంగా కొందరు డాక్టర్లు తేల్చారు. చివరకు అమెరికాలోని ఒర్లాండోలో అండర్సన్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో చికిత్స తర్వాత ప్రమాదం లేదని తెలిసింది. చివరకు న్యూరోసిస్టోసర్కోసిస్‌ అనే నరాల సమస్యగా తేలింది. ఇలాంటి స్థితిలో ఆడలేనంటూ పేస్‌కు మద్దతుగా యూఎస్‌ ఓపెన్‌ నుంచి తప్పుకునేందుకు కూడా మారి్టనా నవ్రతిలోవా సిద్ధమైంది. దాని నుంచి కోలుకున్న తర్వాత పేస్‌ మళ్లీ ప్రాక్టీస్‌కు దిగి తన విజయాలకు శ్రీకారం చుట్టాడు.

వచ్చే ఏడాదే ఆఖరు...
పేస్‌ ఆటతీరు భీకరమైన సరీ్వస్‌లు, బెంబేలెత్తించే ఏస్‌లతో సాగదు. ఇన్నేళ్ల కెరీర్‌లో కూడా అతను వాలీలు, డ్రాప్‌ షాట్‌లనే నమ్ముకున్నాడు. ముఖ్యంగా నెట్‌ వద్ద పేస్‌ ఆట తన పార్ట్‌నర్‌ ఎవరైనా వారికి కొండంత అండ. టెన్నిస్‌ కుర్రాళ్ల ఆటగా మారిపోయిన ఈతరంలో కూడా పేస్‌ నెట్‌ వద్ద అత్యంత బలమైన ఆటగాడు అంటూ ఇటీవల మాజీ సహచరుడు మహేశ్‌ భూపతి ప్రశంసించడం అతని ఆటలో ఇంకా పదును మిగిలి ఉందనే చూపిస్తోంది. రాడ్‌ లేవర్‌ తర్వాత మూడు వేర్వేరు దశాబ్దాల్లో వింబుల్డన్‌ నెగ్గిన ఏకైక ఆటగాడైన పేస్, 100కు పైగా వేర్వేరు భాగస్వాములతో కలిసి డబుల్స్‌ బరిలోకి దిగాడు. ఇటీవల పదే పదే అతని రిటైర్మెంట్‌పై వార్తలు రావడం, దానిని అతను ఖండించడం చాలా సార్లు జరిగాయి. వయసు పెరిగిన కొద్దీ ఇలాంటివి వినిపించడం సహజం. అయితే ఆటను పిచి్చగా ప్రేమించే పేస్, ఏ స్థాయిలోనైనా దానిని కొనసాగించేందుకు ఇష్టపడుతున్నాడు. దాదాపు 20 ఏళ్ల తర్వాత భారత్‌లో తొలిసారి అతను చాలెంజర్‌ టోర్నీ ఆడటానికి కూడా అదే కారణం. డబుల్స్‌లో ప్రస్తుతం ప్రపంచ 105వ ర్యాంకర్‌గా ఉన్న పేస్‌ వచ్చే ఏడాది కెరీర్‌కు వీడ్కోలు పలుకనున్నట్లు బుధవారం అధికారికంగా ప్రకటించాడు.

కొన్ని విశేషాలు....
►అంతర్జాతీయ టెన్నిస్‌లో 700కు పైగా విజయాలు సాధించిన కేవలం ఎనిమిది మంది ఆటగాళ్ళలో ఒకడు.  18 గ్రాండ్‌స్లామ్‌లు (8 పురుషుల డబుల్స్, 10 మిక్స్‌డ్‌ డబుల్స్‌) గెలిచాడు.
►వరుసగా 7 ఒలింపిక్స్‌లలో (1992, 1996, 2000, 2004, 2008, 2012, 2016) పాల్గొన్న ఏకైక టెన్నిస్‌ ఆటగాడు. 1999లో డబుల్స్‌ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌లో నిలిచాడు. వరుసగా 19 సీజన్ల పాటు (1997–2015) ఏడాదికి కనీసం ఒక్క టైటిల్‌ అయినా గెలిచాడు.
►తన ప్రొఫెషనల్‌ కెరీర్‌లో పేస్‌ ఇప్పటివరకు 55 టైటిల్స్‌ సాధించాడు. ఇందులో సింగిల్స్‌లో ఒక టైటిల్‌ ఉండగా... మిగతా 54 టైటిల్స్‌ డబుల్స్‌ విభాగంలో వచ్చాయి.
►సింగిల్స్‌ విభాగంలో పేస్‌ 101 మ్యాచ్‌ల్లో గెలిచి... 99 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. డబుల్స్‌లో పేస్‌ 767 మ్యాచ్‌ల్లో విజయం సాధించి... 455 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. ఇప్పటివరకు తన కెరీర్‌లో పేస్‌ 85,71,006 డాలర్ల ప్రైజ్‌మనీ (రూ. 61 కోట్ల 11 లక్షలు) సంపాదించాడు. 
►1990లో జపాన్‌పై డేవిస్‌ కప్‌లో అరంగేట్రం చేసిన పేస్‌ 57 సార్లు డేవిస్‌ కప్‌ బరిలోకి దిగాడు. 92 మ్యాచ్‌ల్లో గెలిచి (సింగిల్స్‌లో 48; డబుల్స్‌లో 44)... 35 మ్యాచ్‌ల్లో (సింగిల్స్‌లో 22; డబుల్స్‌లో 12) ఓడిపోయాడు. డేవిస్‌కప్‌ చరిత్రలో అత్యధిక డబుల్స్‌ విజయాలు (44) సాధించిన ప్లేయర్‌గా పేస్‌ ప్రపంచ రికార్డు సృష్టించాడు.   

ముందుగా నా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. నేరి్పన క్రమశిక్షణ, చేసిన మార్గదర్శనం, కల్పించిన వాతావరణం ఇవన్నీ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. వారు నా పట్ల కనబరిచిన అనిర్వచనీయమైన ప్రేమ ఎప్పటికీ మరువలేను. అమ్మా–నాన్న... మీరు లేకుంటే నేనూ లేను. ఐ లవ్‌ యూ.   మా అక్కలకు థ్యాంక్స్‌ చెప్పాలి. జాక్వి, మరియాలిద్దరు నాకంటే పెద్దవాళ్లు. వాళ్లే నన్నింతలా మార్చేశారు. జీవన ప్రయాణంలో ఎత్తుపల్లాలు అర్థమయ్యేలా చేశారు. నేనో పరిపూర్ణ వ్యక్తిగా ఎదిగేందుకు బాగా సహకరించారు. తల్లిదండ్రులు చెప్పిన నైతిక విలువల్ని నేనూ పాటించేలా చేశారు. ఐ లవ్‌ యూ సిస్టర్స్‌.   ఇక నా గారాలపట్టి... కుమార్తె అయానా! పాప లవ్స్‌ యూ.

ఈ ప్రపంచంలో అత్యంత అందమైన అంశం కూతుర్ని కలిగి ఉండటం అనేది నీ వల్లే నాకు అర్థమైంది. అయానా నీవే నాకు స్ఫూర్తి. నా కెరీర్‌లో మిగిలున్నది 2020 టెన్నిస్‌ క్యాలెండరే! కేవలం ఎంపిక చేసుకున్న టోర్నీలే ఆడతాను. నా జట్టుతో చేసే ఆఖరి క్రీడా పయనాన్ని గొప్పగా మలచుకుంటా. సహచరులు, మిత్రులు, అభిమానులతో ఆనందంగా గడుపుతా. నా సుదీర్ఘ ప్రయాణానికి అండగా నిలిచిన వారందరికీ థ్యాంక్స్‌. అభిమానులకు విన్నపం. నాతో ఎవరికైనా మధుర జ్ఞాపకాలు, తీపి గుర్తులు ఉంటే ‘లియాండర్‌ మెమోరిస్‌’కు షేర్‌ చేయండి. నేను నా మధుర స్మృతుల్ని మీతో పంచుకుంటాను. ‘గుడ్‌బై ఇయర్‌గా 2020 నాకు ఉద్వేగంగా గడువనుంది. భారంగా నేను రాకెట్‌ను విడువనున్నాను.
– ట్విట్టర్‌లో లియాండర్‌ పేస్‌

పేస్‌ గ్రాండ్‌స్లామ్‌ టైటిల్స్‌
పురుషుల డబుల్స్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: 2012
ఫ్రెంచ్‌ ఓపెన్‌: 1999, 2001, 2009
వింబుల్డన్‌: 1999
యూఎస్‌ ఓపెన్‌: 2006, 2009, 2013

మిక్స్‌డ్‌ డబుల్స్‌
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌: 2003, 2010, 2015
ఫ్రెంచ్‌ ఓపెన్‌: 2016
వింబుల్డన్‌: 1999, 2003, 2010, 2015
యూఎస్‌ ఓపెన్‌: 2008, 2015

►పేస్‌ ప్రతిభకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1990లో అర్జున అవార్డు...1996–1997లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌ ఖేల్‌ రత్న’... 2001లో ‘పద్మశ్రీ’... 2014లో ‘పద్మభూషణ్‌’ అవార్డులు అందజేసింది.

మరిన్ని వార్తలు