పేస్‌ పునరాగమనం

12 Mar, 2018 04:10 IST|Sakshi
లియాండర్‌ పేస్‌

ఏడాది తర్వాత జట్టులో చోటు

చైనాతో ఏప్రిల్‌లో భారత్‌ డేవిస్‌ కప్‌ మ్యాచ్‌

న్యూఢిల్లీ: భారత వెటరన్‌ టెన్నిస్‌ స్టార్‌ లియాండర్‌ పేస్‌కు డేవిస్‌ కప్‌ జట్టులో చోటు దక్కింది. ఏప్రిల్‌ 6, 7 తేదీల్లో చైనాతో జరిగే పోరు కోసం అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐ టీఏ) ఆదివారం జట్టును ప్రకటించింది. ఇందులో 44 ఏళ్ల పేస్‌తో పాటు యూకీ బాంబ్రీ, రామ్‌కుమార్‌ రామనాథన్, సుమిత్‌ నాగల్, రోహన్‌ బోపన్నలు ఉన్నారు. దివిజ్‌ శరణ్‌ రిజర్వ్‌ సభ్యుడిగా ఉంటాడు.  గత ఏప్రిల్‌లో ఉజ్బెకిస్తాన్‌తో జరిగిన డేవిస్‌ కప్‌ ఆసియా ఓసియానియా గ్రూప్‌–1 పోరుకు పేస్‌ను పక్కన పెట్టారు. అయితే ఇటీవలే దుబాయ్‌ ఓపెన్‌లో పేస్‌ రన్నరప్‌గా నిలిచి డబుల్స్‌ ర్యాంకుల్లో మళ్లీ టాప్‌–50లో చోటు దక్కించుకున్నాడు.


‘రోహన్‌ బోపన్నకు పేస్‌తో జతకట్టడం ఇష్టం లేదు. అవసరమైతే అతను చైనాతో జరిగే మ్యాచ్‌ నుంచి వైదొలిగేందుకు సిద్ధంగా ఉన్నాడు’ అని నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ మహేశ్‌ భూపతి సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌కు లేఖ రాశారు. అయితే భూపతి లేఖను, బోపన్న విజ్ఞప్తిని సెలెక్షన్‌ కమిటీ పరిగణనలోకి తీసుకోలేదు. ‘బోపన్న ప్రభుత్వం నుంచి నిధులు పొందుతున్నాడు. అలాంటి వ్యక్తి సొంత విషయాల కోసం దేశం తరఫున ప్రాతినిధ్యం వహించడానికి వెనుకాడితే ఏఐటీఏ ఆ ఆటగాడిని ప్రోత్సహిం చదు.

ఏడాదిలో రెండు లేదా మూడుసార్లు దేశం కోసం ఆడే అవకాశం లభిస్తుంది. అన్ని విషయాలను పక్కనబెట్టి రెండువారాల పాటు దేశం కోసం కలిసి ఆడలేరా? కెప్టెన్‌ భూపతి అభిప్రాయం ప్రకారం వారిద్దరి మధ్య (పేస్, బోపన్న) సఖ్యత లేదు. ఈ విషయంలో బోపన్నను ఒప్పించే బాధ్యత పేస్‌దే. అతను మాత్రమే ఈ పని చేయగలడు’ అని ఏఐటీఏ అధికారి వివరించారు. మరో మ్యాచ్‌ గెలిస్తే పేస్‌ డేవిస్‌కప్‌లో అత్యధిక డబుల్స్‌ మ్యాచ్‌లు నెగ్గిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు సృష్టిస్తాడు.  

భారత జట్టులోకి తిరిగి రావడం ఆనందంగా ఉంది. కొంత కాలంగా బాగా శ్రమిస్తూ ర్యాంక్‌ మెరుగు పరుచుకున్నా. బోపన్నతో కలిసి ముందుకు సాగాలని భావిస్తున్నా. ఓ ఆటగాడిగా బోపన్న ప్రతిభను గౌరవి స్తాను. మేమిద్దరం కలిసి మంచి ప్రదర్శన చేస్తాం.

మరిన్ని వార్తలు