‘ఒక్క రోజులోనే లెజెండ్స్‌ కాలేరు’

31 Oct, 2019 14:10 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌పై అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) నిషేధం విధించిన సంగతి తెలిసిందే. రెండేళ్ల క్రితం ఓ అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు బుకీలు అతడిని సంప్రదించిన విషయాన్ని దాచిపెట్టాడు. ఐసీసీ అవినీతి నిరోధక భద్రత విభాగానికి, బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు దృష్టికి తీసుకెళ్లలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన షకీబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఐసీసీ అతడిపై చర్యలు తీసుకుంది. దీనిలో భాగంగా  అతడు అంతర్జాతీయ క్రికెట్‌ ఆడకుండా రెండేళ్ల నిషేధం విధించింది. ఇప్పటికే షకిబుల్‌కు హసన్‌కు మద్దతుగా ఆ దేశ క్రికెటర్లు అండగా నిలవగా,  బంగ్లా ప్రధాని షేక్‌ హసీనా కూడా మద్దతుగా నిలిచారు.

ఇదిలా ఉంచితే, షకిబుల్‌ సస్పెన్షన్‌పై అతని భార్య ఉమ్మీ అహ్మద్‌ షిషిర్‌ స్పందించారు. ‘లెజెండ్స్‌.. ఏదో ఒక్కరాత్రిలో లెజెండ్స్‌ కాలేరు.  ఎంతో శ్రమిస్తే కానీ ఓ దశకు చేరుకోరు. వాళ్లకూ కష్టకాలం వస్తుంది. కానీ, దృఢ సంకల్పం, మనోధైర్యంతో ఆ పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటారు. షకిబల్‌ మానసిక స్థయిర్యం నాకు బాగా తెలుసు. గాయాల కారణంగా కొన్నాళ్లు ఆటకు దూరమైనా, తిరిగి ప్రపంచక్‌పలో అతనెలాంటి ప్రదర్శన చేశాడో చూశాం. ఇది అతనికి కష్టకాలం. అతని కొత్త ప్రయాణానికి ఆరంభం మాత్రమే’ అని ఉమ్మీ పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు