‘ఫ్రీగా ఫైనల్‌ వెళ్లడం కంటే ఓడిపోవడమే బెటర్‌’

6 Mar, 2020 12:40 IST|Sakshi

సిడ్నీ: మహిళల టీ20 వరల్డ్‌కప్‌లో భారత జట్టు ఫైనల్‌కు అర్హత సాధించడాన్ని దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డేన్‌ వాన్‌ నీకెర్క్‌ జీర్ణించుకోలేనట్లే కనబడుతోంది. గురువారం సిడ్నీ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయ్యింది. దాంతో గ్రూప్‌ స్టేజ్‌లో అత్యధిక విజయాలతో భారత్‌ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించింది. ఇక్కడ రిజర్వ్‌ డే లేకపోవడంతో అత్యధిక లీగ్‌ పాయింట్లను ప్రామాణికంగా తీసుకోవడంతో భారత్‌ ఫైనల్లో అడుగుపెట్టింది. దీనిపై సఫారీ మహిళా క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ వాన్‌ నీకెర్క్‌ పరోక్షంగా సెటైర్లు వేశారు. ( ఫైనల్‌కు టీమిండియా తొలిసారి)

ఆసీస్‌తో జరిగిన రెండో సెమీ ఫైనల్లో దక్షిణాఫ్రికా ఓడిపోయి టోర్నీ నిష్క్రమించిన తర్వాత నీకెర్క్‌ వ్యంగ్యంగా మాట్లాడారు. ఫ్రీగా ఫైనల్‌ చేరడం కంటే సెమీస్‌లో ఓడిపోవడమే బెటర్‌ అంటూ భారత్‌ జట్టును ఉద్దేశించి తన మనసులోని అక్కసును వెళ్లగక్కారు.  ‘నేను కూర్చొని అబద్ధాలు చెప్పదల్చుకోలేదు. మేము గెలిచి ఫైనల్స్‌కు  వెళ్లాలనే ప్రయత్నం చేశాం. వర్షం వల్ల ఆగిపోతే అత్యధిక విజయాలతో మేము ఫైనల్స్‌ వెళతామనే ఆలోచన లేదు. ఫ్రీగా ఫైనల్‌ పాస్‌ను సంపాదించడం కంటే ఆడి ఓడిపోవడమే బెటర్‌’ అని నీకెర్క్‌ తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 

అది మన చేతుల్లో లేదు: హర్హా భోగ్లే
నీకెర్క్‌ వ్యాఖ్యలపై భారత కామెంటేటర్‌ హర్షాభోగ్లే స్పందించారు. మనం మ్యాచ్‌ ఆడి ఫైనల్‌కు  వెళ్లామా. లేక ఫ్రీ పాస్‌తోనా అనేది మన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. ఎవరు ఫైనల్‌కు చేరినా ఫ్రీగా వెళ్లరనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. గ్రూప్‌ స్టేజ్‌లో బాగా ఆడిన కారణంగానే ఫైనల్స్‌కు అర్హత సాధించారని నీకెర్క్‌ వ్యాఖ్యలను తిప్పికొట్టారు. (అప్పుడు బౌండరీలు... ఇప్పుడు లీగ్‌ పాయింట్లు!)

మరిన్ని వార్తలు