మనోళ్లు కూడా ఆసీస్ బాటలోనే..!

26 Mar, 2017 16:56 IST|Sakshi
మనోళ్లు కూడా ఆసీస్ బాటలోనే..!

ధర్మశాల: చివరిదైన నాల్గో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆసీస్ ను మూడొందల పరుగులకు ఆలౌట్  చేసిన భారత జట్టు.. తన తొలి ఇన్నింగ్స్ లో కూడా అపసోపాలు పడుతోంది. ఆసీస్ బాటలోనే పయనిస్తూ వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. రెండో రోజు ఆటలో తడబడుతూనే ఇన్నింగ్స్ కొనసాగించిన భారత్ జట్టు ఆట ముగిసే సమయానికి  ఆరు వికెట్ల నష్టానికి 248 పరుగులు చేసి ఎదురీదుతోంది.


స్కోరు బోర్డుపై పరుగులేమీ లేకుండా ఆదివారం ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ మురళీ విజయ్(11) తొలి వికెట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు.ఆసీస్ పేసర్ హజల్ వుడ్ బౌలింగ్ లో వికెట్ కీపర్ మాథ్యూ వేడ్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. ఆ తరుణంలో రాహుల్ కు జత కలిసిన చటేశ్వర పూజారా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడుతూ స్కోరు బోర్డును గాడిలో పెట్టారు. ఈ క్రమంలోనే రాహుల్ (60)హాఫ్ సెంచరీ సాధించాడు.వీరిద్దరూ 87 పరుగులు జోడించిన తరువాత రాహుల్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. దాంతో కెప్టెన్ అజింక్యా రహానే-పుజారాల జంట మరమ్మత్తులు చేపట్టింది.

 

ఆసీస్ బౌలింగ్ ను ఆచితూచి ఆడుతూ స్కోరును 150 పరుగులు దాటించారు. ఆ సమయంలో హాఫ్ సెంచరీ సాధించిన పుజారా(57) మూడో వికెట్ గా అవుటయ్యాడు. ఆ తరువాత కరుణ్ నాయర్(5) వెంటనే పెవిలియన్ చేరడంతో భారత జట్టు 167 పరుగులకే నాల్గో వికెట్ను కో్ల్పోయింది. ఆ తరుణంలో రహానే తో జత కలిసిన అశ్విన్ సమయోచితంగా ఆడాడు. వీరిద్దరూ 49 పరుగులు జోడించిన తరువాత రహానే(46) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. ఆసీస్ స్పిన్నర్ లియాన్ బౌలింగ్ లో స్మిత్ క్యాచ్ ఇచ్చిన రహానే పెవిలియన్ చేరాడు. ఆపై స్వల్ప వ్యవధిలో అశ్విన్ (30) కూడా అవుట్ కావడంతో భారత జట్టు 221 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. అయితే వృద్దిమాన్ సాహా(10 బ్యాటింగ్;43 బంతుల్లో 1 ఫోర్ ),జడేజా(16బ్యాటింగ్; 23 బంతుల్లో 2 సిక్సర్లు)లు జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును కదిలిస్తున్నారు. భారత జట్టు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. ఆసీస్ బౌలర్లలో లియాన్ నాలుగు వికెట్లు సాధించగా,హజల్ వుడ్, కమిన్స్లకు తలో వికెట్ దక్కింది.

మరిన్ని వార్తలు