ఐపీఎల్‌ ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి..

26 May, 2018 10:28 IST|Sakshi

ఇండోర్‌: ఐపీఎల్‌ బెట్టింగ్‌  తారాస్థాయికి చేరిందనడానికి తాజా ఘటనే ఉదాహరణ. ఐపీఎల్‌ ప్రత్యక్ష ప్రసార సిగ్నల్స్‌ను దొంగిలించి మరీ  బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వైనం వెలుగులోకి వచ్చింది. సాధారణంగా టీవీల్లో కొన్ని సెకన్లు ఆలస్యంగా మ్యాచ్‌ ప్రసారమవుతుంది. దీన్నే ఆసరాగా చేసుకున్న ఈ బెట్టింగ్‌ బృందం.. సిగ్నల్స్‌ను దొంగిలించడం ద్వారా టీవీల్లో ప్రసారం కావడానికి ఎనిమిది సెకన్ల ముందే మ్యాచ్‌ గమనాన్ని తెలుసుకుని కోట్లలో బెట్టింగ్‌లకు పాల్పడుతోంది. క్రికెట్‌ బెట్టింగ్‌ టిప్స్‌ ఫర్‌ ఫ్రీ పేరు ఒక వెబ్‌సైట్‌ను తెరిచిన ఈ ముఠా.. మ్యాచ్‌ ఫీడ్‌ను మళ్లించి ఈ సైట్లో ఉంచుతోంది.

మధ్యప్రదేశ్‌ పోలీసులు ఈ రాకెట్‌ను బట్టబయలు చేశారు. ఈ ముఠా దుబాయ్‌ కేంద్రంగా పని చేస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. దీనికి ప్రధాన సూత్రధారి అంకిత్‌ జైన్‌ అలియాస్‌ మున్నూ జాకీగా అనుమానిస్తున్నారు. అతన్ని విదిషాలో అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇండోర్‌ సైబర్‌ సెల్‌ ఎస్పీ జితేందర్‌ సింగ్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు