ధోనినా.. మజాకా..!

23 Dec, 2017 12:49 IST|Sakshi

సాక్షి, ఇండోర్‌: శ్రీలంకతో ఇండోర్‌లో జరిగిన రెండో టి 20లో భారత్‌ విజయం సాధించి సరీస్‌ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. మహేంద్ర సింగ్‌ ధోని అందరి చూపు తనవైపు తిప్పుకుంటున్నాడు. మొదటి టి 20లో ధోని రెండు క్యాచ్‌లు, రెండు స్టంప్‌ అవుట్‌ చేసి  జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రెండో టి 20లో కూడా అటూ బ్యాటింగ్‌లో, ఇటూ కీపింగ్‌లో అందర్ని అబ్బురపరిచాడు. భారత్‌ 20 ఓవర్లలో 260 పరుగులు చేసింది. ఇండియాకు టి20లో ఇదే అత్యధిక స్కోర్‌ కావడం విశేషం. బ్యాటింగ్‌కు వచ్చిన శ్రీలంక లక్ష్యఛేదనలో తడబడి 88 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 

కుల్దీప్‌ యాదవ్‌ వేసిన 15 ఓవర్లో గుణరాత్నే షాట్‌ ఆడబోయి వికెట్ల వెనుక ధోనికి చిక్కాడు.  అందరూ నాటౌట్‌​అనుకున్నారు.. కానీ ధోని మాత్రం ఆ సమయంలో చాలా కానిఫిడెంట్‌గా కనిపించారు. లెగ్‌ ఆంపైర్‌ నిర్ణయాన్ని థర్డ్‌ ఆంపైర్‌కు ఇచ్చాడు. చివరకు అది స్టంప్‌ అవుట్‌ అని తేలింది. అలాగే, చాహల్‌ వేసిన 16 ఓవర్లో శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ సమరవిక్రమను కూడా ధోని స్టంప్‌ అవుట్‌ చేశాడు. అద్భుత ప్రదర్శనతో ధోని ఇటీవల తనపై వచ్చిన రూమర్స్‌కు తనదైన శైలిలో సమాధానం చెబుతున్నాడు. 

వన్‌డౌన్‌లో ధోని...
రోహిత్‌ అవుట్‌ అయిన తర్వాత అనూహ్యంగా వన్‌డౌన్‌లో వచ్చిన ధోని (21 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాహుల్‌కు జత కలిశాడు. 14వ ఓవర్‌ తొలి రెండు బంతులను బౌండరీలు బాదాడు. మధ్యలో కొంత తగ్గినా... స్పిన్నర్‌ ధనంజయ వేసిన 17వ ఓవర్‌లో రెండు సిక్స్‌లు కొట్టాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 78 పరుగులు జత చేశాడు.

ధోని మరో రికార్డు చేరువలో..
ధోని మరో మూడు క్యాచ్‌లు పడితే అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో 50 క్యాచ్‌లు పట్టిన తొలి వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ప్రస్తుతం 47 అంతర్జాతీయ టీ 20 క్యాచ్‌లతో ధోని ఉన్నాడు.  ముంబైలో ఆదివారం జరగనున్న మూడో టి 20 మ్యాచ్‌లో ధోని ఈ ఘనత సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

>
మరిన్ని వార్తలు