మునుపటిలా రెచ్చిపోయిన ధోనీ

10 Jan, 2017 17:55 IST|Sakshi
మునుపటిలా రెచ్చిపోయిన ధోనీ

సెంచరీ చేసిన అంబటి రాయుడు
యువీ, ధవన్‌ హాఫ్‌ సెంచరీలు
ఇంగ్లండ్‌ లెవెన్‌తో భారత్‌ ఏ ప్రాక్టీస్‌ మ్యాచ్‌


ముంబై: ఇటీవల స్థాయికి తగ్గట్టుగా బ్యాటింగ్‌లో రాణించలేకపోతున్న టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఇరగదీశాడు. ఇంగ్లండ్‌ లెవెన్‌తో ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో మునుపటి ధోనీని గుర్తుకు తెస్తూ బ్యాట్‌తో రెచ్చిపోగా.. కొంతకాలంగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న అంబటి రాయుడు శతకం బాది సత్తా చాటుకున్నాడు. అలాగే మూడేళ్ల తర్వాత వన్డే జట్టులోకి వచ్చిన యువరాజ్‌ సింగ్‌ హాఫ్‌ సెంచరీతో రాణించాడు. దీంతో భారత్‌ ఏ జట్టు భారీ స్కోరు సాధించింది. ముంబైలో మంగళవారం జరుగుతున్న ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఏ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 304 పరుగులు చేసింది.

రాయుడు  97 బంతుల్లో11 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత రిటైర్డ్‌ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఐదో నెంబర్‌లో బ్యాటింగ్‌కు దిగిన మహీ తనదైన శైలిలో ఆడి 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో అజేయంగా 68 పరుగులు చేశాడు.  శిఖర్ ధవన్ (63), యువరాజ్‌ (48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 56) హాఫ్‌ సెంచరీలు చేశారు. రాయుడు నిలకడగా రాణించగా.. ధోనీ, యువీ దూకుడుగా ఆడి అభిమానుల్ని అలరించారు. బెస్ట్‌ మ్యాచ్‌ ఫినిషర్‌గా పేరున్న ధోనీ.. కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత సత్తాచాటాడు. ఇంగ్లండ్‌ బౌలర్లు జాక్‌ బాల్‌, డేవిడ్‌ విల్లీ రెండేసి వికెట్లు తీశారు. ఇంగ్లండ్‌తో టి-20, వన్డే సిరీస్‌లకు టీమిండియా కెప్టెన్గా విరాట్‌ కోహ్లీని నియమించిన సంగతి తెలిసిందే. కాగా ఈ మ్యాచ్‌కు మాత్రం ధోనీకి సారథ్య బాధ్యతలు అప్పగించారు.

మరిన్ని వార్తలు