ధోని కెప్టెన్సీ.. షకీబ్‌ బలి

22 Sep, 2018 15:12 IST|Sakshi
ఫీల్డింగ్ మార్పు చేయాలని రోహిత్‌కు సూచిస్తున్న ధోని

సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు

దుబాయ్‌: టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోని సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొని చాలా రోజులు అవుతున్నా.. తన మార్క్‌ కెప్టెన్సీని మాత్రం ప్రేక్షకులు మిస్సవ్వడం లేదు. కెప్టెన్సీ పదవి వదులుకున్నా ఓ సీనియర్‌ ఆటగాడిగా ధోని జట్టులో అవసరమైనప్పుడు తన సూచనలు, సలహాలతో ఆటగాళ్లకు అండగా నిలుస్తున్నాడు. తాజాగా ఆసియాకప్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ధోని మరోసారి తన మార్క్‌ కెప్టెన్సీని చూపించాడు. తన అనుభవం జట్టుకు ఎలా ఉపయోగపడుతుందో చెప్పకనే చెప్పాడు. చాలా రోజుల తర్వాత జట్టులోకి వచ్చిన రవీంద్ర జడేజాకు, తాత్కలిక  కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు తన వ్యూహాలతో అండగా నిలిచాడు. (చదవండి: జడేజా ‘సూపర్‌’  4)

బంగ్లాదేశ్‌ కీలక బ్యాట్స్‌మన్‌, ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ను పెవిలియన్‌ చేర్చడంలో ధోని కీలక పాత్ర పోషించాడు. జడేజా వేసిన తొలి ఓవర్‌లోనే షకీబ్‌ వరుస బౌండరీలతో రెచ్చిపోయాడు. దీంతో స్లిప్‌లో ఉన్న ధావన్‌ను స్క్వేర్‌ లెగ్‌కు మార్చాలని ధోని, రోహిత్‌కు సూచించాడు. వెంటనే రోహిత్‌ ఫీల్డింగ్‌ మార్చగా.. ఆ మరుసటి బంతికే షకీబ్‌.. ధావన్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేరాడు. దీంతో ధోని వ్యూహం ఫలించింది. ఇక ధోని మార్క్‌ కెప్టెన్సీ పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ధోని నుంచి కెప్టెన్సీ దూరం కావచ్చు కానీ.. తనలోని సారథ్య లక్షణాలు మాత్రం కోల్పోలేదని..దటీజ్‌ ధోని అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్లతో ఘనవిజయం సాధించి విషయం తెలిసిందే. (చదవండి: ధోనిని ఔట్‌ చేసింది ఓ స్కూల్‌ టీచర్‌ తెలుసా?)

మరిన్ని వార్తలు