మలిష్క డబుల్‌ ధమాకా

12 Jan, 2019 10:31 IST|Sakshi

‘ఐటా’ టెన్నిస్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఐటా) చాంపియన్‌షిప్‌ సిరీస్‌ అండర్‌–14 టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ అమ్మాయి కె. మలిష్క సత్తా చాటింది. కాకినాడలోని కాస్మోపాలిటన్‌ క్లబ్‌ వేదికగా జరిగిన ఈ టోర్నీలో మలిష్క సింగిల్స్, డబుల్స్‌ విభాగాల్లో విజేతగా నిలిచి రెండు టైటిళ్లను కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన బాలికల సింగిల్స్‌ ఫైనల్లో టాప్‌ సీడ్‌ మలిష్క (తెలంగాణ) 6–0, 6–3తో రెండోసీడ్‌ హర్షిణి విశ్వనాథ్‌ (ఏపీ)పై విజయం సాధించింది.

అంతకుముందు జరిగిన సెమీస్‌లో మలిష్క 6–1, 6–2తో రాహీన్‌ తరనమ్‌ (తెలంగాణ)పై, క్వార్టర్స్‌లో 6–2, 6–1తో జ్యోత్స్న (ఏపీ)పై నెగ్గింది. మరోవైపు బాలికల డబుల్స్‌ టైటిల్‌పోరులో మలిష్క–రాహీన్‌ (తెలంగాణ) ద్వయం 7–5, 6–2తో హర్షిణి–జ్యోత్స్న (ఏపీ) జోడీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. సెమీస్‌లో మలిష్క జంట 6–1, 6–2తో శవినిత–చరిష్మా జోడీపై గెలిచింది. బాలుర విభాగంలో మహారాష్ట్రకు చెందిన అర్నవ్‌ విజేతగా నిలవగా... ఏపీ ప్లేయర్‌ సుహృధ్‌ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఫైనల్లో అర్నవ్‌ 7–6 (1), 6–1తో సుహృధ్‌ను ఓడించాడు. డబుల్స్‌ ఫైనల్లో మురళీ సాత్విక్‌–సుహృధ్‌ (ఏపీ) జంట 6–3, 6–1తో సిద్ధాంత్‌ కృష్ణ (హరియాణా)–యజ్ఞేశ్‌ (తెలంగాణ) జోడీపై విజయం సాధించి టైటిల్‌ను అందుకుంది., , ,

మరిన్ని వార్తలు