స్మృతీ మంధాన అరుదైన ఘనత

31 Dec, 2018 17:11 IST|Sakshi

దుబాయ్‌: ఈ ఏడాదికిగాను భారత మహిళా జట్టు క్రికెటర్ స్మృతి మంధాన వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌తో పాటు  వుమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్ ద ఇయర్ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది అద్భుతంగా రాణించిన మంధాన ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో రెండు ఐసీసీ అవార్డులను దక్కించుకున్న తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన రికార్డును నెలకొల్పారు. ప్రధానంగా వెస్టిండీస్‌లో మహిళా వరల్డ్‌ టీ20ల్లో భారత్‌ సెమీ ఫైనల్‌ చేరడంలో మంధాన కీలక పాత్ర పోషించారు. ఆ టోర్నీలో 125పైగా స్ట్రైక్‌రేట్‌తో 178 పరుగులు సాధించారు.

ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న మంధాన ఓవరాల్‌గా 1291 పరుగులు చేశారు.  12 వన్డేలకు గాను 669 పరుగులు సాధించిన మంధాన.. 25 టీ20ల్లో 622 పరుగులు చేశారు. ఈ ఏడాది వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించడం మరో విశేషం. అదే సమయంలో ఐసీసీ ప్రకటించిన అత్యుత్తమ వన్డే, టీ20 జట్లలో కూడా మంధాన చోటు దక్కించుకున్నారు.  దాంతో ఏక కాలంలో రెండు ఐసీసీ అవార్డులు మంధాన సొంతమయ్యాయి.

2018 ప్రదర్శనలో భాగంగా మీడియా-బ్రాడ్‌కాస్టర్స్‌ సభ్యులతో కూడిన బృందం ఓటింగ్‌ పద్ధతిలో అత్యుత్తమ క్రీడాకారిణులను ఎన్నుకోవడంతో పాటు రెండు అత్యుత్తమ జట్లను ఎంపిక చేశారు.  ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) సోమవారం తన అధికారిక ట్విట్టర్‌లో వివరాలను వెల్లడించింది.

మరిన్ని వార్తలు