న్యూఢిల్లీ: భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) స్టార్ ప్లేయర్ మనిక బత్రా ప్రతిష్టాత్మక ‘బ్రేక్థ్రూ టేబుల్ టెన్నిస్ స్టార్’ అవార్డు దక్కించుకుంది. ఈ పురస్కారం పొందిన తొలి భారత టీటీ ప్లేయర్ మనిక కావడం విశేషం. అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలోని ఇంచియోన్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో మనికకు ఈ అవార్డు ప్రదానం చేశారు.
‘ఈ పురస్కారం దక్కడం గౌరవంగా భావిస్తున్నా. ఈ ఏడాది చాలా గొప్పగా గడిచింది’ అని ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో వ్యక్తిగత పసిడి పతకంతో పాటు టీమ్ విభాగంలో భారత మహిళల జట్టు స్వర్ణం గెలవడంలో మనిక కీలక పాత్ర పోషించింది.