భారత బాక్సర్ల కొత్త చరిత్ర

19 Sep, 2019 10:00 IST|Sakshi

 ఒకేసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌లో  రెండు పతకాలు ఖాయం

 సెమీస్‌ చేరిన అమిత్, మనీశ్‌

ఎకతెరీన్‌బర్గ్‌ (రష్యా): మూడున్నర దశాబ్దాల చరిత్రగల ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌ తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచింది. తొలిసారి ఈ మెగా ఈవెంట్‌లో ఏకకాలంలో రెండు పతకాలను ఖాయం చేసుకుంది. అమిత్‌ (52 కేజీలు), మనీశ్‌ కౌశిక్‌ (62 కేజీలు) సెమీఫైనల్‌ చేరి కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. మిగతా క్వార్టర్‌ ఫైనల్స్‌లో సంజీత్‌ (91 కేజీలు) 1–4తో ఏడో సీడ్‌ జూలియో టోరెస్‌ (ఈక్వెడార్‌) చేతిలో... కవీందర్‌ సింగ్‌ బిష్త్‌ (57 కేజీలు) 0–5తో మెక్‌గ్రెయిల్‌ (ఇంగ్లండ్‌) చేతిలో ఓటమి చెందారు. 

ఆసియా క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌ స్వర్ణ విజేత అమిత్‌  క్వార్టర్‌ ఫైనల్లో 4–1తో కార్లో పాలమ్‌ (ఫిలిప్పీన్స్‌)పై విజయం సాధించాడు. 63 కేజీల క్వార్టర్‌ ఫైనల్లో మనీశ్‌ 5–0తో వాండెర్సన్‌ డి ఒలివిరా (బ్రెజిల్‌)పై గెలుపొందాడు. గతంలో ఏ ప్రపంచ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్‌లోనూ భారత్‌ ఒక కాంస్యాన్ని మించి గెలవలేకపోయింది. విజేందర్‌ (2009), వికాస్‌ కృషన్‌ (2011), శివ థాపా (2015), గౌరవ్‌ బిధురి (2017) కాంస్యం నెగ్గారు.

మరిన్ని వార్తలు