ఒలింపిక్స్‌ బరిలో ‘రికార్డు’ పంచ్‌

12 Mar, 2020 06:29 IST|Sakshi

టోక్యోకు మనీశ్‌ కౌశిక్‌  క్వాలిఫై

అమ్మాన్‌ (జోర్డాన్‌): భారత్‌ నుంచి రికార్డు స్థాయిలో మరో బాక్సర్‌ ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించాడు. ప్రపంచ కాంస్య పతక విజేత మనీశ్‌ కౌశిక్‌  (63 కేజీలు) తాజాగా ‘టోక్యో’ దారిలో పడ్డాడు. ఆసి యా క్వాలిఫయర్స్‌ ఈవెంట్‌లో బుధవారం కామన్వెల్త్‌ గేమ్స్‌ చాంపియన్, రెండో సీడ్‌ హరిసన్‌ గార్సి డ్‌ (ఆస్ట్రేలియా)పై 4–1తో గెలుపొందడం ద్వారా కౌశిక్‌కు ఒలింపిక్స్‌ బెర్తు ఖాయమైంది. ఇప్పటికే ఎనిమిది మంది బాక్సర్లు ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు అర్హత పొందారు. కౌశిక్‌తో ఆ జాబితా తొమ్మిదికి చేరింది. దీంతో ఈ సారి అత్యధిక బాక్సర్లు అర్హత సంపాదించినట్లయింది. గతంలో లండన్‌ ఒలింపిక్స్‌ (2012)లో భారత్‌ నుంచి 8 మంది పాల్గొన్నారు. ఇప్పుడీ రికార్డు 9 మందితో మెరుగైంది. 81 కేజీల కేటగిరీలో సచిన్‌ కుమార్‌ నిరాశపరిచాడు. అతను 0–5తో షబ్బొస్‌ నెగ్మతుల్లెవ్‌ (తజకిస్తాన్‌) చేతిలో కంగుతిన్నాడు.

సిమ్రన్‌కు రజతం
మహిళల 60 కేజీల ఫైనల్‌ బౌట్‌లో సిమ్రన్‌జిత్‌ కౌర్‌ పరాజయం చవిచూసింది. దీంతో ఆమె స్వర్ణావకాశం చేజారి రజతంతో సరిపెట్టుకుంది. తుదిపోరులో భారత బాక్సర్‌ 0–5తో దక్షిణ కొరియాకు చెందిన ఓహ్‌ యూన్‌ జీ చేతిలో పరాజయం పాలైంది.  69 కేజీల విభాగంలో వికాస్‌ క్రిషన్‌ కంటి గాయంతో స్వర్ణ పతక పోరు నుంచి తప్పుకున్నాడు. దీంతో అతను రజతంతో తృప్తి చెందాడు.  

మరిన్ని వార్తలు